Friday, 5 August 2022
The cloud and the lightning!
Sunday, 26 June 2022
Poetic symbolism in Sat Sampradaya Literature
ఈ శ్లోకం అర్థం తెలుసుకుంటే అన్నమాచార్య కీర్తనలకు అర్థం తెలుసుకోవడం చాలా సులభం అని ఈ పోస్టు ఈ బ్లాగులో చేర్చడం అయ్యింది.
1వ భాగం, ఉపోద్ఘాతం
----------------------------
కమలా కుచ చూచుక కుంకుమతో
నియతారుణితాతుల నీల తనో
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే
అర్థం: జగన్మాత స్తనాగ్రాలపై ఉన్న కుంకుమతో ఎర్రటి వర్ణం లోకి మారిన నీల దేహం కలవాడివి , పెద్ద పెద్ద కళ్ళతో లోకాలని వీక్షించేవాడివి, అయిన ఓ లోకపతీ! నీకు విజయం.
దేవుడు ఆడా మగా? జగన్మాత అని మళ్ళీ ప్రత్యేకంగా ఏమిటి? దేవుడు నీలంగా ఉంటాడా? ఒక వేంకటాద్రి మీదనే ఉంటాడా? ముందు సుప్రభాతంలో మాతః సమస్త జగతాం అని చెప్పి మళ్ళీ ఈ మొదటి రెండు లైన్లు ఏమిటి?
దేవుడు నీలంగా ఉంటాడు అంటే ఎవరో చూసినట్టు కాదు. ఒక నీలి మబ్బు కమ్ముకున్నట్టుగా మనల్ని తన అనుగ్రహంలో తడిసి ముద్ద చెయ్యడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడుట. ఇలా అనుకోవడం వల్ల ఒక విధమైన ధైర్యం వస్తుంది. భగవంతుడు తెల్లగా ఉంటాడు అంటే స్వచ్ఛతకు ప్రతీక.
ఇంక కమలాదేవి ఎవరు? కమలంపై ఉండే దేవి, కమలం మార్దవానికి ప్రతీక. ఆవిడని ఎవరైనా చూసారా?
అసలు వాల్మీకి రామాయణంలో సాగర మథనం మొత్తం చెప్పి అమ్మవారు సాగరంలో పునరావిర్భవించిన కథ కూడా చెప్పలేదు. వేదంలో శ్రీసూక్తంలో కూడా రూపం ఇది అని చెప్పలేదు.
మరి అమ్మవారికి నాలుగు చేతులతో ఒక రూపంతో ఎందుకు కొలుస్తారు? లక్ష్మీ దేవిని సీతగా వాల్మీకి వర్ణించారు. అంతకంటే విలక్షణంగా ఆ సీతకు మూలమైన అమ్మవారిని అదే వాల్మీకి వర్ణించిన రూపంతో, కానీ నాలుగు చేతులతో కొలుస్తారు. BTW, వాల్మీకి రామాయణం దేవుడికి శ్యామ వర్ణం (నల్లని దేహం, కారు మబ్బుని సూచించే విధంగా) చెపుతుంది!
మరి ఆవిడ ఎక్కడ ఉంటుంది? భగవంతుడి వక్షస్స్థలంలో అట. భగవంతుడు అంటే ఏవో నాలుగు చేతులతో ఎవరికీ తెలీని లోకంలో ఉంటాడా? అలాంటపుడు ఆయనని అసలు తలవడం ఎందుకు? అంతకంటే గొప్ప విషయాలు చాలా లేవా?
పురుష సూక్తం విశ్వరూపం చెప్పింది.
మరి విశ్వరూపం అయితే, ఏది తల, ఏవి చేతులు, వక్షస్స్థలం ఎక్కడ ఉంటుంది?
ఇపుడు వక్షస్స్థలం అనే మాటను తీసేద్దాం. తెలుగు సంస్కృతాల్లో హృదయం, తమిళంలో మార్బు, ఇంగ్లీషులో heart.
ఎవరైనా సహృదయుడు, kind hearted అంటే అర్థం ఏమిటి? ఎదుటి వారి పట్ల సానుభూతి ఉంది అని అర్థం.
అలాగే అమ్మవారు భగవంతుడి హృదయంలో ఉంది అంటే, ఆయన దయామయుడు అని అర్థం. ఈ పోస్టు ఏ శ్లోకం గురించి రాయబడ్డదో ఆ స్తోత్ర రచయిత అణ్ణన్ స్వామి గురువు గారు అయిన శ్రీమద్ వేదాంత దేశికులు అమ్మవారిని శ్రీనివాసుడి దయాదేవిగా చెపుతూ ఒక శతకమే రాసారు.
దయ కృప శ్రద్ధ ఇవన్నీ మాతృ లక్షణాలు కాబట్టి, భగవంతుడి ఈ లక్షణాన్ని జగన్మాతగా చెప్పారు. అంతే కాకుండా, "మాతా చ కమలా దేవీ పితా దేవో జనార్దనః" అని చాణక్యుడు చెప్పిన శ్లోకం ప్రకారం చూసినా, తల్లిదండ్రుల కాన్సెప్టులో జగన్మాత, జగత్పిత అని భావిస్తే మనసుకు బావుంటుంది. లేక పోతే నిజానికి భగవంతుడు ఆడా మగా అని చెప్పలేం. జగత్పతి అన్నపుడు మాత్రం అది పుంలింగంలోనే ఉంది. ఒకే భగవంతుడు తల్లీ, తండ్రీ, పతీ అన్నపుడే ఇది భౌతికంగా ఆలోచించేది కాదు అని తట్టాలి!
పైన వక్షస్స్థలం గురించి చెప్పిన లాజిక్కే సర్వాంతర్యామి కనులకు కూడావర్తిస్తుంది, "కమలాయత లోచన" అన్నప్పుడు. పైగా లక్ష్ అనే ధాతువుకు "ఆలోచనే" అని అర్థం. అంటే తెలుగులో ఆలోచన కాదు. లక్షించి (చూసి) అనుగ్రహించడం, ఆ తత్త్వమే లక్ష్మి. లోకం అన్నా వీక్షించబడేది అని అర్థం. అందుకే అమర కోశ కారుడు లక్ష్మీ దేవిని లోక మాత అన్నాడు.
2వ భాగం
---------------
కమలా కుచ చూచుక కుంకుమతో
నియతారుణితాతుల నీల తనో
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే
అర్థం: జగన్మాత స్తనాగ్రాలపై ఉన్న కుంకుమతో ఎర్రటి వర్ణం లోకి మారిన నీల దేహం కలవాడివి , పెద్ద పెద్ద కళ్ళతో లోకాలని వీక్షించేవాడివి, అయిన ఓ లోకపతీ! నీకు విజయం.
ఇంతకు ముందు భాగంలో నీల తనువు అంటే ఏమిటో చూసాం. కమలాయత లోచన లోకపతే అంటే ఏమిటో చూసాం. భగవంతుడి హృదయం అంటే, ఆయన దయకు సూచకం అనీ, పెద్ద కళ్ళతో వీక్షించడం అంటే, ఆ దయతో సర్వలోకాలనూ చూడటం అనీ కిందటి భాగంలో ప్రస్తావించబడింది. జగన్మాత అంటే కృప మాతృ లక్షణం కాబట్టి, ఒక ఇంట్లో లాగ, జగత్తుకి మాతా పితా ఉన్నారు అనుకుంటే, భద్రతా భావం కలుగుతుంది కాబట్టి వైదిక సంప్రదాయంలో ఇలా భావిస్తారు అని కూడా చెప్పబడింది.
అసలు భగవంతుడికి దయ ఉండాలా? లేక పోతే వచ్చిన నష్టం ఏమిటి? ఆయన గొప్పతనం ఏమైనా తగ్గుతుందా? అని అడగవచ్చు.
ఆయన దయామయుడు అనుకోవడం వల్ల ఒక విధమైన సాంత్వన కలుగుతుంది. అలా కాకుండా ఏదో మెకానికల్ గా కర్మ సాక్షి అనో, ఇంకొకటి అనో అనుకుంటే ఆ confidence రాదు. దీనికి వేదం, శ్రద్ధయా దేవో దేవత్వం అశ్నుతే అని చెప్పింది. అసలు దేవుడి దేవత్వమే ఆయనకి మనపట్ల ఉన్న శ్రద్ధవల్ల అట.
అంతా బాగానే ఉంది. మధ్యలో ఈ స్తనాలు ఏమిటి? స్తనాగ్రాలు ఏమిటి?
శ్లోక రచయిత సంస్కృతంలో తమిళంలో మహా పండితులు. వారు వేదాంత దేశికుల వద్ద, వరవర మునీంద్రుల వద్ద అధ్యాత్మ విద్యను అధ్యయనం చేశారు. అన్నమయ్యను అర్థం చేసుకోవాలి అన్నా వారి సంప్రదాయంలోని ఈ సుప్రభాత కర్త అయిన అణ్ణన్ స్వామి వంటి వారిని అర్థం చేసుకోవాలి అన్నా ప్రాచీన తమిళ భక్తి సాహిత్యంతో, ముఖ్యంగా ఆళ్వార్ల దివ్య ప్రబంధంతో పరిచయం ఉండాలి.
ఆళ్వార్ల కవిత్వంలో స్త్రీ స్తనాలు మనం మన పతి అయిన భగవంతుడికే చెంది ఉండటం (భగవదేక శేషత్వం) అనే దానికి ప్రతీక. వీటిని ఒక కండలు తిరిగిన మగవాడికి, ఒక చీమకు, ఒక బండరాయికి, మొత్తం జగత్తుకు చెప్పవచ్చు. అపుడు మూర్తీభవించిన ఆయన దయాగుణమే అయిన అమ్మవారికి చెప్పడంలో ఆశ్చర్యం లేదు.
మరి చూచుక అని (స్తనాగ్రం) అని కూడా ఎందుకు రాశారు?
ముందు కుంకుమతః అన్న దానిని చూద్దాం. కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది. పైన చెప్పబడ్డ సాహిత్యంలో ఎరుపు వాత్సల్యానికి చిహ్నం. వాత్సల్యం అంటే ఆవు తన లేగదూడని నాకే అంత అభిమానం భగవంతుడికి మనయందు ఉంటుంది.
దయ, వాత్సల్యం ఇవి అన్నీ ఒకే విధమైన గుణాలు. కాబట్టి అతిశయించిన కరుణతో ఆయన మనల్ని తల్లిలాగ ప్రేమిస్తూ, మనం అంటే వాత్సల్యం కలిగి ఉంటాడు.
కాబట్టి కమలాదేవి దయ, కృప, శ్రద్ధ ఇలాంటివి సూచిస్తే, ఆయనకే చెందిన ఆయన దయాగుణం అతిశయించి, ఆయన మనల్ని పుత్రవాత్సల్యంతో ఆవు తన దూడ మలిన భూయిష్టమైన శరీరాన్ని అత్యంత ప్రీతితో ఇష్టపడినట్టుగా, దగ్గరకు తీసుకుంటాడు.
ఈవిధంగా కమల-దయ, కుచాలు - ఆవిడ భగవంతుడి అధీనంలో ఉండటం. కుచ చూచుకం - భగవంతుడికి మనపై దయ తారాస్థాయికి వెళ్లడం. కుంకుమ - వాత్సల్యం (ఎరుపురంగు కారణంగా).
ఇందుచేత ఆయన నీలమేఘం వంటి శరీరం ఎర్రగా మారిందిట! ఇవీ ఇందులో ఉన్న సంకేతార్థాలు.
అందుకే ఈ ఫోటో పెట్టడం జరిగింది. ఈ ఫొటోలో ఎంత శృంగారం ఉందో, అంతే శృంగారం ఈ శ్లోకంలో కూడా ఉంది!
ప్రశ్నలు - సమాధానాలు:
---------------------------------
1. శృంగారాన్ని శృంగారంగా చూడాలి. ఇలా మార్చెయ్యడం ఏమిటి?
ముందు కవిత్వాన్ని కవిత్వంగా చూడటం నేర్చుకోండి. ఒకాయన నేను ఒక అన్నమయ్య కీర్తనకు ఇదే రకంగా అర్థం చెపితే ఏడుపు సింబల్ పెట్టాడు, పైగా రచయితట. కవిత్వం తెలిసిన వారు నిజానికి మనకు చెప్పాలి, poetic symbolism అనేది ఒకటి ఉంటుంది అని.
నేను చెప్పిన సంకేతార్థాలు ఈ శ్లోక రచయిత సంప్రదాయంలో చాలా మందికి తెలిసినవే.
దేవుడు తన కృపతో రక్షించును, ఆయనను స్తుతింపుడి అంటే అది కవిత్వం కాదు, అదేదో ప్రార్థన అవుతుంది.
2. ఇక్కడ జగత్తుకి తల్లిదండ్రుల మధ్యనే కదా చెప్పబడింది. భార్యాభర్తల మధ్య ధర్మబద్ధం అయిన శృంగారం లేకపోతే ముఖ్యంగా ఈ ప్రపంచానికి తల్లిదండ్రుల మధ్య, అసలు ఈ సృష్టి ఉంటుందా అండి?
శ్రీరామాయణంలో బ్రహ్మ "అహం తే హృదయం రామ" అని భగవంతుడితో అంటాడు. అంటే, విష్ణువు హృదయమే బ్రహ్మ. ఆయన ఎపుడు ఎలా సంకల్పిస్తే అపుడే అలాగే సృష్టి అని అర్థం. ఇంక ఈ ప్రశ్న మరీ చిన్న పిల్లల ప్రశ్నలా ఉంది. త్రిమతాలకు చెందిన మేధావులం అనుకునే వారు అడగదగ్గది కాదు. కొంచెం ఆలోచించండి. అదేదో తంత్ర శాస్త్ర గ్రంథం (నాకు ఎలా తెలుసు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో 90ల్లో ఇలాంటి భావజాల వ్యాప్తి కోసం వార పత్రికల్లో కూడా వేసే వారు) చెప్పినట్టుగా దేవీ దేవుల (శ్రీవారు, అమ్మవారు కాదు) ప్రణయం వల్ల ఈ ప్రపంచం సంభవించలేదు, శ్లోక కర్త సంప్రదాయం ప్రకారం.
3. మరి అన్యమతస్థులు, నాస్తికులు ప్రశ్నిస్తే?
పైన నేను చెప్పినది అయితే శ్లోక కర్త అధ్యయనం చేసిన సాహిత్యం ప్రకారం. లేదూ మీకు తెలిసిన పద్ధతిలో సమాధానం ఇవ్వండి. గౌరవ ప్రదమైన చర్చ ఓకే. ఎదుటి వారు దూషిస్తే పోలీసు కంప్లైంట్ ఇవ్వండి.
4. మరి శృంగార పరమైన సాహిత్యం ఆధ్యాత్మికతలో నిషేధమా?
అద్వైతులు జీవ బ్రహ్మల ఐక్యానికీ, విశిష్టాద్వైతులు జీవుడూ బ్రహ్మా (అంటే పరబ్రహ్మం) కలిసి ఆనందించడానికీ సంకేతార్థంగా భాగవత శ్లోకాలనీ, రెండవ వారు అయితే తమిళ పాశురాలనీ ఇంకా భాగవతం మొదలైన పురాణ శ్లోకాలనీ , ఉపయోగిస్తారు. అలాగే చాలా అన్నమయ్య కీర్తనలు కూడా ఇదే కోవకు వస్తాయి. ఈ శృంగారంలో ప్రతీకలు చాలా గట్టిగా ఉంటాయి. ఎందుకంటే కాల పరిమితి ఉన్నదానికంటే అనంతంగా ఉండేది చాలా గొప్పది కదా? నిజానికి ఇది అర్థం చేసుకున్న వారికి చాలా మంచి ఆలోచనలు కలిగి కామ క్రోధాలు తగ్గుతాయి.
Saturday, 2 April 2022
The term Anjanadri as explained by Annamayya
అన్నమాచార్య కీర్తన: అణురేణు పరిపూర్ణమైన
రాగం: షణ్ముఖ ప్రియ
స్వరకర్త: శ్రీమాన్ వేద వ్యాస ఆనంద భట్టర్ స్వామి
పాడిన వారు: శ్రీమతి శ్రావణి గంటి
కీర్తన వ్యాఖ్యానంతో బాటు వినడం కోసం ఈ క్రింది ఆడియో లింక్ క్లిక్ చేయండి:
https://www.youtube.com/watch?v=pT6eikswZg0
పల్లవి:
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపమువేదాంతవేత్తలెల్ల వెదకేటిరూపము
ఆదినంత్యము లేని యారూపము
పాదుగ యోగీంద్రులు భావించురూపము
యీదెస నిదివో కోనేటిదరి రూపము
కాలపు సూర్యచంద్రాగ్నిగల రూపము
మేలిమి వైకుంఠాన మెరసిన రూపము
కీలైనదిదె శేషగిరిమీదిరూపము
ముంచినబ్రహ్మాదులకు మూలమైనరూపము
కొంచని మఱ్ఱాకుమీది కొనరూపము
మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము
యెంచగ శ్రీవేంకటాద్రి నిదె రూపము
Sunday, 3 October 2021
Allied post - Pothana's praise of the Divine Mother
పోతన భాగవత పద్యాలు - ఒక పరిశీలన
అమ్మలఁ గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలఁ బె
ద్దమ్మ సురారులమ్మకడు పాఱడిపుచ్చినయమ్మ దన్ను లో
Sunday, 19 September 2021
Viswaprakasunaku - A humble attempt to decode a deeply philosophical song
అన్నమయ్య సంకీర్తన సంఖ్య 155సంపుటం 1
Thursday, 24 December 2020
You are My everything!
శ్రీవిష్ణు సహస్ర నామం పూర్వ పీఠిక వ్యాఖ్యానంలో అన్నమాచార్యుల పూర్వాచార్యులైన పరాశర భట్టార్యులు ధ్యానం అన్న పదానికి భగవద్ గుణ అనుచిన్తనం అని నిర్వచనం ఇచ్చారు. భగవంతుడి గుణగణాలని స్మరించడాన్ని మించిన ధ్యానం లేదు. దీనికి సుమధురమైన కీర్తనల రూపంలో అవకాశాన్నిమనకి ప్రసాదించిన వారు అన్నమాచార్యులు.
ఈ కీర్తనలో అన్నమయ్య భగవన్నామ కీర్తన ద్వారా భగవద్గుణానుభవం చేస్తున్నారు.
Click here for an audio visual by Smt. Sravani Ganti.
పల్లవి:
అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ
వివరణ:
తాపాలనీ పాపాలనీ హరించే శ్రీహరే నాకు సర్వస్వం.
పుండరీకాక్షుడు అంటే తామర పువ్వుల వంటి పెద్ద కళ్ళతో లోకాలని వీక్షించే వాడు. కాబట్టి, లోకంలో ఎక్కడకు వెళ్లినా ఆయన చూస్తూనే ఉంటాడు. ఇంకా తామర పువ్వుల వంటి పాదాలని జ్ఞానులకు దర్శింపచేసే వాడు అని కూడా అర్థం ఉంది. జ్ఞాని అయిన వాడికి ఎటు చూసినా ఆ త్రివిక్రముడి పాదాలే కనిపిస్తాయి.
అందరినీ ఆనందింప చేసేవాడు రాముడు. అలాంటి భగవంతుడు ఎపుడూ నా చెంతన ఉన్నాడు. రఘురాముడు అని చెప్పడంలో మన కోసం ఆయన దశరథ కుమారుడిగా రఘుకుల తిలకుడిగా అవతరించడం ఉంది.
చరణం 1:
కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజనాభ
వివరణ:
శ్రీవిష్ణు సహస్రనామంలో మహా వరాహో గోవిందః అన్న చోట గోవింద నామానికి అర్థం భూమిని పొందిన వాడు అని అర్థం. ఆ భూదేవికి మగడైన గోవిందుని కులమే భూలోక వాసులైన మన అందరిదీ. అన్నమయ్య ఇంకో కీర్తనలో అన్నట్టుగా ఇందులో జంతుకులం ఇంతా ఒకటే! అంతా ఆ శ్రీహరే కాబట్టి ఆయనే మన కులం.
కరుణానిధి అయిన ఆ శ్రీనిధే మన పెన్నిధి.
సమస్తాన్నీ ధరించేది ధరణి. ఆ ధరణిని ధరించే ధరణీధరుడే మన ధారణా శక్తి. ఆయన కృప వల్లనే ఆయనని మనం గుర్తు పెట్టుకోగలం.
సృష్టికర్త అయిన బ్రహ్మకి తన నాభికమలంలో స్థానాన్ని ఇచ్చిన ఆ పద్మనాభుడే నా నివాసం.
చరణం 2:
తనువును నీవే దామోదర నా మనికియు నీవే మధుసూదన వినికియు నీవే విట్ఠలుడా నా వెనకముందు నీవే విష్ణు దేవుడా
వివరణ:
మన అహంకార మమకారాలని నాశనం చేసి ఇంద్రియాలని నిగ్రహించే వాడు మధుసూదనుడు. కాబట్టి ఆ మధుసూదనుడే నా అర్థవంతమైన మనుగడ.
మాయతో అందరినీ బంధించే ఈశ్వరుడు యశోదా దేవి చేత తాళ్లతో రోకలికి కట్టి వెయ్యబడ్డాడు. అందువల్ల ఆయనని దామోదరుడు అని పిలుస్తారు. తన సంకల్పంతో నన్ను ఈ శరీరానికి బద్ధుడిని చేసిన ఆ దామోదరుడే నా శరీరం. దామోదరుడు అంతర్యామిగా ఉన్న ఆత్మని దామోదరుడు అంతర్యామిగా ఉన్న శరీరంతో ఆ దామోదరుడే తన మాయచే కట్టి వేసాడు. ఆహా! ఎంత అద్భుతమో కదా!
భగవన్నామ శ్రవణమే నాకు వినికిడి.
నాకు వెనుక ముందు అన్ని వైపులా ఉన్నది ఆ విశ్వరూపుడైన విష్ణు దేవుడే.
చరణం 3:
పుట్టుగు నీవే పురుషోత్తమ కొన నట్టనడుము నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే
వివరణ:
పురుష సూక్తంలో చెప్పినట్లు సృష్టికంతటికీ మూలమైన ఆ పురుషోత్తముడే నా పుట్టుక. నరులందరికీ అంటే జీవులందరికీ మార్గం అయిన నారాయణుడే నా చిట్ట చివరి గమ్యం. రెండింటి మధ్య అంతా కూడా ఆయనే. భగవద్గీత విభూతి యోగంలో స్వామి "అహం ఆదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవ చ" అన్నదానికి అనువాదమే ఈ చరణంలో మొదటి భాగం.
ఏ విధంగా అయినా ఓ శ్రీవేంకటేశా! నువ్వే నా గతివి, నాకు వేరే గతి లేదు, లేదు, లేదు.
Saturday, 3 October 2020
Lord's union with the chosen self
పల్లవి:
కోరిన కోరికలెల్ల కొమ్మయందే కలిగీని
చేరి కామయజ్ఞ మిట్టే సేయవయ్యా నీవు
వివరణ:
శ్రీవిష్ణు సహస్ర నామంలో యజ్ఞో యజ్ఞపతిర్ యజ్వా యఙ్ఞాంగో యజ్ఞ వాహనః యజ్ఞ భృత్ యజ్ఞ కృత్ యజ్ఞీ యజ్ఞ భుక్ యజ్ఞ సాధనః అని చెప్పబడినట్టు, భగవంతుడే భగవంతుడే యజ్ఞం, యజ్ఞ కర్త,యజ్ఞ భోక్త, సర్వమూ. యజ్ఞం అంటే భగవంతుడే అని వేదం యజ్ఞో వై విష్ణుః అని చెపుతుంది. యజ్ఞం చేసేది నాయకుడు, దానికి వేదిక నాయిక (జీవుడు)! యం ఏవైష వృణుతే తేన లభ్యః అని కఠ ముండకోపనిషత్తులలో చెప్పినట్టుగా ఆయన ఎవరిని వరిస్తే వారికే దొరుకుతాడు. ఇప్పుడు ఈ నాయికకు దొరికాడు.
చరణం 1:
సుదతిమోవి తేనెలు సోమపానము నీకు
పొదుపైన తమ్ములము పురోడాశము
మదన పరిభాషలు మంచి వేద మంత్రములు
అదె కామయజ్ఞము సేయవయ్యా నీవు
వివరణ:
పువ్వులో తేనె పువ్వు కోసం కాకుండా ఇతరుల కోసం ఉన్నట్టు, నాయిక ఉన్నది నాయకుడి కోసం.
తాంబూలం భోగ్యత్వానికి ప్రతీక. ఇంక అతిశయించిన మోహంతో మాట్లాడే మాటలే వేదం మంత్రాలు.
చరణం 2:
కలికి పయ్యద నీకు కప్పిన కృష్ణాజినము
నలువైన గుబ్బలు కనక పాత్రలు
కలసేటి సరసాలు కర్మ తంత్ర విభవాలు
చెలగి కామయజ్ఞము సేయవయ్యా నీవు
వివరణ:
పయ్యదని తన కృష్ణాజినంగా మన యాజ్ఞీకుడు వేసుకున్నాడు. ఆ పయ్యదలోని గుబ్బలు శేషత్వాన్ని సూచిస్తాయనీ, శేషత్వం అంటే భగవంతుడికి మాత్రమే చెంది అయన అనుభవం కోసం మాత్రమే ఉండటం. ఇంక నాయకుడు చెలగి యజ్ఞం కొనసాగించాడు.
చరణం 3:
కామిని కాగిలి నీకు ఘనమైన యాగశాల
ఆముకొన్న చెమటలే యవబృథము
యీమేరనే శ్రీవేంకటేశ నన్ను నేలితి
చేముంచి కామ యజ్ఞము సేయవయ్యా నీవు
వివరణ:
యజ్ఞశాల ఏమిటి అంటే చెప్పక్కర్లేదు. నీల మేఘ వర్ణుడు వర్షించిన చెమటే ఇద్దరికీ అవబృథ స్నానం! ఈ విధంగా శ్రీవేంకటేశుడు నన్ను కూడా ఏలాడు అని ఒక జీవుడు తాదాత్మ్యం చెందటమే ఈ కీర్తన సారాంశం.
Click below for a link to the nice rendering by Sri Garimella Balakrishna Prasad garu.