Sunday, 11 September 2022

The divine mother the personification of His grace is the sole refuge for all

 ॥పల్లవి॥ శ్రీసతికరుణే దిక్కు జీవుల కెల్లా

వాసుదేవుఁడా రమణీవశమైయుండఁగను


భగవద్ రామానుజుల వారు అశరణ శరణ్యామ్ అని శరణాగతి గద్యంలో చెప్పినట్టుగా భగవత్కరుణ శ్రీదేవి మాత్రమే జీవులందరికీ దిక్కు. 

శ్రీయతే ఇతి శ్రీ, శ్రయతే ఇతి శ్రీ, అంటే, మనల్ని భగవంతుడికి ఆశ్రయింపచేసేదీ, భగవంతుడిని నిరంతరం ఆశ్రయించి ఉండేదీ, జగన్మాతే. 


శ్రీవాసుదేవ మహిషీ పుంప్రధానేశ్వరేశ్వరీ అని లక్ష్మీ సహస్రనామాల్లో చెప్పినట్టు అమ్మవారు పురుషోత్తముడైన వాసుదేవుడికి కూడా ఈశ్వరి. భగవంతుడు తన కృపకి తానే వశం అయి ఉంటాడు అని అర్థం. ఈ విధంగా అన్నమయ్య కీర్తనల్లో ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది. 

క్షీరాబ్ధౌ శ్రీర్యథా జాతా పూర్వం భృగు సుతా సతీ అన్నది శ్రీవిష్ణుపురాణం. పూర్వం భృగుమహర్షి కూతురుగా ఆవిర్భవించిన సతి శ్రీదేవి క్షీరాబ్ధి కన్యకగా వచ్చింది అని అర్థం.  

 సత్తా అంటే అర్థవంతమైన ఉనికి అని అర్థం. భగవంతుడి లాగే శుద్ధసత్త్వరూపిణి అయిన లక్ష్మీదేవిని అందుకే శ్రీసతి అంటారు. 

అదే విధంగా  భర్త జీవితానికి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి భార్యని సామాన్య పరిభాషలో  సతి అని పిలుస్తారు. 


॥చ1॥ సీతవద్దనుండ రాముచేఁ గాకాసురునకు

నాతలఁ బ్రాణము నిల్చె నపరాధియైనాను

యేతుల రావణాసురుఁ డిటువంటివాఁడే కాఁడా

కాతరాన నొంటిఁ జిక్కి పిండతుండా లాయెను


కాకాసురుడికి లోకాలన్నిట్లో ఎవరూ శరణు ఇవ్వకపోతే అపుడు సీతాదేవితో కూడిన రాముడినే ఆశ్రయిస్తే రాముడు రక్షించాడు. 

రావణాసురుడు అహంకారంతో సీత తన అధీనం కావాలి, రాముడు వద్దు అనుకున్నాడు. ఏమైందో తెలిసినదే. 

॥చ2॥ కదిసి రుక్మిణి యుండఁగాఁ గృష్ణునిచే రుక్మికి

అదన బ్రదుకు గల్గె నతిద్రోహి యైనాను

యెదుటనే శిశుపాలుఁ డీరీతివాఁడే కాఁడా

తుద సభలో వదరి తునకలై పడెను


రుక్మిణీదేవితో కలిసి శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్తుండగా అడ్డు వచ్చిన రుక్మిని అమ్మవారు ప్రార్థిస్తే కృష్ణుడు చంపకుండా అతని జుట్టూ గడ్డమూ మీసాలూ ఒకవైపు కోసేసి పరాభివించి వదిలేస్తాడు. 


అదే కృష్ణుడు ఒక్కడూ వెళ్లిన రాజసూయ యాగంలో శిశుపాలుడి నూరవ తప్పుకి అతనిని చంపివేస్తాడు. 


॥చ3॥ సిరితోడ పైనుండఁగ శ్రీనరసింహుచే దైత్య

గురుపుత్రులు నిలిచిరి క్రూరకర్ము లైనాను

పరగ శ్రీవేంకటేశుపగ గాఁడా హిరణ్యుఁడు

గరిమ నదరిపాటుగాఁగాఁ బొలిసెను

శ్రీదేవి నరసింహ స్వామి తొడపై ఉండగా దైత్య గురు పుత్రులు అంటే హిరణ్యకశిపుడి ఇతర కుమారులూ, ప్రహ్లాదుడి గురువు కుమారులూ, మొదలైన వారు కావచ్చు. వాళ్ళు ప్రహ్లాదుడిని ఎంత హింసించిన వారైనా భగవంతుడు వీరందరూ నిజానికి నా పిల్లలే కదా అని దయతో వదిలేసాడు. 


అదే తాను ఆవిర్భవించినపుడు హిరణ్యకశిపుడిని మాత్రం అప్పటికప్పుడే చీల్చి వధించాడు. 


శూర్పణఖ సీత వద్దు రాముడే కావాలి, ఈమె ఏదో మానవస్త్రీ, నాకు ప్రతిబంధకమైనది అనుకున్నట్టుగా, లక్ష్మీదేవి లేని నారాయణుడు రక్షిస్తాడు, ఆయనే కావాలి, ఈవిడ ఎవరో ఒక దేవత మాత్రమే, అని భేద భావంతో వేరుగా తలిచేవారికి ఈ కీర్తన చక్కని బోధ. 

Click below for a link to an audio visual:





Ksheerabdhi Kanyakaku

అన్నమాచార్య కీర్తన:
*క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహలక్ష్మికిని*
*నీరజాలయకును నీరాజనం*

గానం: శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు
రాగం: మధ్యమావతి
రేకు: 1050-1
సంపుటము: 20-295
రేకురాగము: మంగళకౌశిక

పల్లవి:
క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం

చరణం1:
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం

చరణం2:
చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివ నిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం

చరణం3:
పగటు శ్రీ వేంకటేశు పట్టపు రాణియై
నెగడు సతి కళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కఁదనములకెల్ల
నిగుడు నిజశోభనపు నీరాజనం

వివరణ:
సులభంగానే పదాలు ఉన్నాయి కాబట్టి పెద్దగా రాయట్లేదు.

పల్లవి:
ఇందులో క్షీరాబ్ధి కన్యకకు అంటే అంతకు ముందు అమ్మవారు లేదా అనే సందేహం వస్తుంది. భగవంతుడితో పాటు నిత్యమూ ఉండే ఆయన కృప సృష్టి జరిగాక మొదట భృగు మహర్షి కూతురిగా ఆవిర్భవించింది. దేవతలు కష్టాల్లో ఉన్నపుడు వారిని అనుగ్రహించడం కోసం మళ్ళీ క్షీరసముద్రంలో ఆవిర్భవిస్తుంది.
భృగోః ఖ్యాత్యాం సముత్పన్నా శ్రీః పూర్వముధధేః పునః
దేవ దానవ యత్నేన ప్రసూతామృత మంథనే|
అని శ్రీవిష్ణుపురాణం చెపుతోంది. భాగవతం కూడా ఇదే చెప్పింది.

లక్ష్మి అంటే అర్థం గతంలో నా పోస్టుల్లో చూసాం. ఒక్క ముక్కలో లోకమాత అని అర్థం చెప్పుకోవచ్చు.

చరణం1:
పద్మాలు మార్దవానికి చిహ్నాలు. నేత్రాలని పోల్చినపుడు సర్వాన్నీ దర్శించే సామర్థ్యాన్ని చెపుతాయి.
జలజాక్షి ముఖం కూడా జలజమే!

కుచాల గురించి గతంలో చెప్పాను. అమ్మవారికి అయినా, ఒక మగవాడికైనా, ఒక జడవస్తువుకి అయినా భగవంతుడికి మాత్రమే చెంది ఉండటం అనే లక్షణాన్ని సూచిస్తాయి. భగవంతుడు భర్త!

కొప్పు జ్ఞానానికి ప్రతీక. ఇంక వరద అభయ హస్తాల గురించి చెప్పక్కర్లేదు.

చరణం2:
పాదపద్మాలు (చరణ కిసలయమ్ములు) శ్రీమన్నారాయణుడి శరణ్యత్వానికి చిహ్నాలు.

అమ్మవారు ఆశరణ శరణ్య అయితే భగవంతుడు అనాలోచిత విశేష అశేష లోక శరణ్యుడు (భగవద్ రామానుజులు చెప్పినట్టుగా). శరణు లేని వారికి ఆవిడ శరణం అయితే, ఏమీ ఆలోచించకుండా సమస్త లోకాలకీ ఆయనే శరణు! ఇంక ఇద్దరికీ తేడా ఏమిటి? అందుకే పెద్దలు ఒక ప్రత్యేక దేవతగా కాకుండా మూర్తీభవించిన భగవత్ కృపగా చెపుతారు.

ఊరు అంటే ఆధారం అయినది. రంభ అంటే వెదురు. రంభోరు అంటే వెదురు వంటి బలహీనమైన తొడలు లేదా మోకాలికీ పాదానికీ మధ్య భాగం కలిగినది అని చెప్పవచ్చు. అంటే భగవంతుడే తప్ప వేరే ఆధారం లేనిది ఆయన కృప.

అయ్యవారు కల్పవృక్షం అయితే అమ్మవారు కల్పలత అని శ్రీవిష్ణుపురాణం.

జఘనం అన్నా ఇదే అర్థం వస్తుంది. జఘనం రాగానికి కూడా చిహ్నం. అరిది జఘనం అంటే అరుదైన అంటే ఉందీ లేదా అన్నట్లు ఉన్న నడుము! అమ్మవారికి అయ్యవారిపై ఎంతో రాగం ఉన్నప్పటికీ, అయ్యవారి రాగంతో పోలిస్తే అమ్మవారి ఉండీ లేనట్టుట! అమ్మవారి విషయంలో నహి నిందా న్యాయం. జీవుల విషయంలో సహజం. అందుకే అన్నమయ్య నాయికా భావంలోని శృంగార కీర్తనల్లో కూడా సన్నని నడుముగా చెపుతారు జీవుడికి.

ఇంకా అమ్మవారికి అయ్యవారిపై ఆధార పడటమే తప్పించి ప్రత్యేకంగా అస్తిత్వం లేదు అని నేను చక్కని తల్లికి చాంగుభళా కీర్తనలో రాసిటనట్టు కూడా జఘనం (నడుము) విషయంలో చెప్పవచ్చు. దీనికి స్త్రీ పురుషుల్లో ఎవరు గొప్ప ఇలాంటి అర్థాలు తియ్యకూడదు. భగవంతుడు స్త్రీ పురుషనపుంసక భేదాలకి అతీతుడు.

నాభి అంటే కేంద్రం. భగవదనుగ్రహానికి ఆయన దయే మూలం!

చరణం3:
పట్టపు రాణి అని ఎందుకు అన్నారు అంటే, భగవంతుడికి ప్రపంచంలో ఉన్నవారు అందరూ భార్యలే! అయితే సమస్త విశ్వంలో ఉన్న జీవుల పట్ల ఆయన దయ లేదా శ్రద్ధని శ్రీదేవిగా, భూలోకంలో ఉన్న మన అందరి పట్ల శ్రద్ధని భూదేవిగా, ప్రతి ఒక్క జీవి పట్ల ఉన్న శ్రద్ధని నీళాదేవిగా చెపుతారు. అంచేత శ్రీదేవి పట్టపురాణి!

Click here for an audio visual:




Friday, 5 August 2022

The cloud and the lightning!

తాళ్లపాక పెద తిరుమలాచార్య కీర్తన
॥పల్లవి॥
ఒకపరి కొకపరి కొయ్యారమై
మొకమునఁ గళలెల్లా మొలచిన ట్లుండె
స్వామి ముఖంలో కళలు ఒకదానితో ఒకటి వయ్యారంగా పోటీపడుతూ మరీ ఆవిష్కరించబడ్డాయిట. ఏమిటి ఆ కళలు అంటే ఎంతైనా చెప్పవచ్చు. కళ్ళు, విల్లు లాంటి కనుబొమలు, చిరునవ్వుతో కూడిన పెదాలు, ముంగురులు, వీటన్నిటినీ వర్ణించుకుంటూ పోతే ఎంతైనా చెప్పవచ్చు. సర్వత్ర ఉన్న దేవుడికి కళ్ళు ఏమిటి, నోరు ఏమిటి అని అడిగితే దానికీ సమాధానం ఉంది!
॥చ1॥
జగదేకపతిమేనఁ జల్లిన కర్పూరధూళి
జిగిగొని నలువంకఁ జిందఁగాను
మొగిఁ జంద్రముఖి నురమున నిలిపెఁ గనక
పొగరువెన్నెల దీగఁబోసినట్లుండె
జగత్పతి శ్రీవేంకటేశ్వరుడి తిరుమంజన సమయంలో (అభిషేకం) ఆయనపై చల్లిన కర్పూరం అన్ని వైపులా చిందగా, అది చంద్రముఖి అయిన అమ్మవారి వెన్నెలా అన్నట్టుగా ఉందిట!
అమ్మవారు చంద్రముఖి అయితే ఆయన ఆ చంద్రుడికి నివాసం అయిన ఆకాశం. వ్యాపకత్వ లక్షణం ఉన్న కర్పూరం వెన్నెల లాగ ఉంది.
ఉరమున నిలిపె అంటే తన వక్షస్స్థలం మీద ఆ దయాదేవికి ఆధారం ఏర్పరిచాడు. ఇంతకు ముందు ఒక సారి రాసినట్టుగా హృదయాన్ని దయకి స్థానంగా చెపుతారు. ఇది చాలా సాధారణమే.
॥చ2॥
పొరి మెఱుఁగుఁజెక్కులఁ బూసిన తట్టుపుణుఁగు
కరఁగి యిరుదెసలఁ గారఁగాను
కరిగమనవిభుఁడు గనక మోహమదము
తొరిగి సామజసిరి దొలఁకినట్లుండె
పునుగు పిల్లి నుంచి స్రవించే కస్తూరి ఎంతో చక్కటి వాసన కలిగినది. ఈ విధంగా కస్తూరి మృగాన్ని భగవంతుడి విభూతిగా (special manifestation) భావించి దాని నుంచి వచ్చిన కస్తూరితో ఆయనకి తిలకం దిద్దుతారు. అభిషేక సమయంలో ఆయన చెక్కిళ్ళకు రాసిన కస్తూరి కిందకు కారగా, అది ఏనుగు మదం లాగా ఉందిట. ఎలా అంటే ఆవిడ కరిగమన కాబట్టి (ఏనుగు వంటి నడక కలది, స్త్రీలని ఇలా పోలుస్తారు) దానికి అనుగుణంగా ఒక మదపుటేనుగు మదం తొలికినట్టుగా.
ఈ మోహం ఎవరి మీద అంటే, తన కృప అయిన ఆవిడ మీద. తన కృపకి వశుడై మనల్ని అనుగ్రహిస్తాడని అర్థం.
ఏనుగు ఐశ్వర్యానికి ప్రతీక. ఆవిడ ఈశ్వరి అయితే ఆయన ఆవిడకే ఈశ్వరుడు. శ్రీశః అంటే శ్రీకి ఈశ్వరుడు, తనకి శ్రీని ఈశ్వరిగా కలిగినవాడు అని రెండు అర్థాలు ఉన్నాయి.
శ్రీరామాయణంలో అయితే అమ్మవారూ అయ్యవారూ ఒకపరికొకపరి అన్నట్టుగా ఇద్దరూ కూడా, భగవంతుడు సూర్యుడు అయితే అమ్మవారు సూర్యప్రభ అని పోటీ పడి మరీ చెపుతారు.
శ్రీవారు "అనన్యార్హా మయా సీతా భాస్కరేణ ప్రభా యథా" అంటే, అమ్మవారు "అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభా యథా" అని అంటారు.
॥చ3॥
మెఱయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను
తఱచయిన సొమ్ములు ధరియించఁగా
మెఱుఁగుఁబోణి యలమేలుమంగయుఁ దాను
మెఱుపుమేఘము గూడి మెఱసినట్లుండె
ఆయన శరీరం మీద స్వర్ణాభరణాల్ని ధరించగా, ఆ ఆభరణాలే మెరుపు తీగల్లాగా, ఆయన కారుమబ్బు లాగా అనిపించింది. నారాయణ సూక్తంలో "నీలతోయద మధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా" అన్నదానికి అర్థం కారుమబ్బువంటి శ్రీమన్నారాయణుడిలో జగన్మాత విద్యుల్లేఖ అంటే మెరుపు తీగ లాగా భాసిస్తోందట. కారుమబ్బు కరుణని వర్షించడానికి సిద్ధంగా ఉన్న స్వామికి సంకేతం అయితే, మెఱుపు ఆయనని మనకి దర్శింపచేసేది. మెఱుపు వచ్చీ పోయినట్టుగానే ఆయన మనకి తెలిసీ తెలియకుండా ఉంటాడు! శ్రీవేంకటాచలంపై మాత్రం నిరంతరం అనుగ్రహిస్తూనే ఉంటాడు!
మొదటి రెండు చరణాల్లో వ్యాపక లక్షణాలు ఉన్న కర్పూరం, వెన్నెలా, కస్తూరిలని ఎంచుకోవడం కూడా భగవంతుడూ ఆయన కృపల వ్యాపకత్వానికి చిహ్నం.



Sunday, 26 June 2022

Poetic symbolism in Sat Sampradaya Literature

ఈ శ్లోకం అర్థం తెలుసుకుంటే అన్నమాచార్య కీర్తనలకు అర్థం తెలుసుకోవడం చాలా సులభం అని ఈ పోస్టు ఈ బ్లాగులో చేర్చడం అయ్యింది. 


1వ భాగం, ఉపోద్ఘాతం 

----------------------------

కమలా కుచ చూచుక కుంకుమతో 

నియతారుణితాతుల నీల తనో 

కమలాయత లోచన లోకపతే 

విజయీభవ వేంకట శైలపతే

అర్థం: జగన్మాత స్తనాగ్రాలపై ఉన్న కుంకుమతో ఎర్రటి వర్ణం లోకి మారిన నీల దేహం కలవాడివి , పెద్ద పెద్ద కళ్ళతో లోకాలని వీక్షించేవాడివి, అయిన ఓ లోకపతీ! నీకు విజయం. 

దేవుడు ఆడా మగా? జగన్మాత అని మళ్ళీ ప్రత్యేకంగా ఏమిటి? దేవుడు నీలంగా ఉంటాడా? ఒక వేంకటాద్రి మీదనే ఉంటాడా? ముందు సుప్రభాతంలో మాతః సమస్త జగతాం అని చెప్పి మళ్ళీ ఈ మొదటి రెండు లైన్లు ఏమిటి? 

దేవుడు నీలంగా ఉంటాడు అంటే ఎవరో చూసినట్టు కాదు. ఒక నీలి మబ్బు కమ్ముకున్నట్టుగా మనల్ని తన అనుగ్రహంలో తడిసి ముద్ద చెయ్యడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడుట. ఇలా అనుకోవడం వల్ల ఒక విధమైన ధైర్యం వస్తుంది. భగవంతుడు తెల్లగా ఉంటాడు అంటే స్వచ్ఛతకు ప్రతీక. 

ఇంక కమలాదేవి ఎవరు? కమలంపై ఉండే దేవి, కమలం మార్దవానికి ప్రతీక. ఆవిడని ఎవరైనా చూసారా?

అసలు వాల్మీకి రామాయణంలో సాగర మథనం మొత్తం చెప్పి అమ్మవారు సాగరంలో పునరావిర్భవించిన కథ కూడా చెప్పలేదు. వేదంలో శ్రీసూక్తంలో కూడా రూపం ఇది అని చెప్పలేదు. 

మరి అమ్మవారికి నాలుగు చేతులతో ఒక రూపంతో ఎందుకు కొలుస్తారు? లక్ష్మీ దేవిని సీతగా వాల్మీకి వర్ణించారు. అంతకంటే విలక్షణంగా ఆ సీతకు మూలమైన అమ్మవారిని  అదే వాల్మీకి వర్ణించిన రూపంతో, కానీ  నాలుగు చేతులతో కొలుస్తారు. BTW, వాల్మీకి రామాయణం దేవుడికి శ్యామ వర్ణం  (నల్లని దేహం, కారు మబ్బుని సూచించే విధంగా) చెపుతుంది!

మరి ఆవిడ ఎక్కడ ఉంటుంది? భగవంతుడి వక్షస్స్థలంలో అట. భగవంతుడు అంటే ఏవో నాలుగు చేతులతో ఎవరికీ తెలీని లోకంలో ఉంటాడా? అలాంటపుడు ఆయనని అసలు తలవడం ఎందుకు? అంతకంటే గొప్ప విషయాలు చాలా లేవా?

పురుష సూక్తం విశ్వరూపం చెప్పింది. 

మరి విశ్వరూపం అయితే, ఏది తల, ఏవి చేతులు, వక్షస్స్థలం ఎక్కడ ఉంటుంది?

ఇపుడు వక్షస్స్థలం అనే మాటను తీసేద్దాం. తెలుగు సంస్కృతాల్లో హృదయం, తమిళంలో మార్బు, ఇంగ్లీషులో heart. 

ఎవరైనా సహృదయుడు, kind hearted అంటే అర్థం ఏమిటి? ఎదుటి వారి పట్ల సానుభూతి ఉంది అని అర్థం. 

అలాగే అమ్మవారు భగవంతుడి హృదయంలో ఉంది అంటే, ఆయన దయామయుడు అని అర్థం. ఈ పోస్టు ఏ శ్లోకం గురించి రాయబడ్డదో  ఆ స్తోత్ర రచయిత అణ్ణన్ స్వామి గురువు గారు అయిన శ్రీమద్ వేదాంత దేశికులు అమ్మవారిని శ్రీనివాసుడి దయాదేవిగా చెపుతూ ఒక శతకమే రాసారు. 

దయ కృప శ్రద్ధ ఇవన్నీ మాతృ లక్షణాలు కాబట్టి, భగవంతుడి ఈ లక్షణాన్ని జగన్మాతగా చెప్పారు. అంతే కాకుండా, "మాతా చ కమలా దేవీ పితా దేవో జనార్దనః" అని చాణక్యుడు చెప్పిన శ్లోకం ప్రకారం చూసినా, తల్లిదండ్రుల కాన్సెప్టులో జగన్మాత, జగత్పిత   అని భావిస్తే మనసుకు బావుంటుంది. లేక పోతే నిజానికి భగవంతుడు ఆడా మగా అని చెప్పలేం. జగత్పతి అన్నపుడు మాత్రం  అది పుంలింగంలోనే ఉంది. ఒకే భగవంతుడు తల్లీ, తండ్రీ, పతీ అన్నపుడే ఇది భౌతికంగా ఆలోచించేది కాదు అని తట్టాలి!

పైన వక్షస్స్థలం గురించి చెప్పిన లాజిక్కే సర్వాంతర్యామి కనులకు కూడావర్తిస్తుంది, "కమలాయత లోచన" అన్నప్పుడు. పైగా లక్ష్ అనే ధాతువుకు "ఆలోచనే" అని అర్థం. అంటే తెలుగులో ఆలోచన కాదు. లక్షించి (చూసి) అనుగ్రహించడం, ఆ తత్త్వమే లక్ష్మి. లోకం అన్నా వీక్షించబడేది అని అర్థం. అందుకే అమర కోశ కారుడు లక్ష్మీ దేవిని లోక మాత అన్నాడు.


2వ భాగం 

---------------

కమలా కుచ చూచుక కుంకుమతో 

నియతారుణితాతుల నీల తనో 

కమలాయత లోచన లోకపతే 

విజయీభవ వేంకట శైలపతే

అర్థం: జగన్మాత స్తనాగ్రాలపై ఉన్న కుంకుమతో ఎర్రటి వర్ణం లోకి మారిన నీల దేహం కలవాడివి , పెద్ద పెద్ద కళ్ళతో లోకాలని వీక్షించేవాడివి, అయిన ఓ లోకపతీ! నీకు విజయం. 

ఇంతకు ముందు భాగంలో నీల తనువు అంటే ఏమిటో చూసాం. కమలాయత లోచన లోకపతే అంటే ఏమిటో చూసాం. భగవంతుడి హృదయం అంటే, ఆయన దయకు సూచకం అనీ, పెద్ద కళ్ళతో వీక్షించడం అంటే, ఆ దయతో సర్వలోకాలనూ చూడటం అనీ కిందటి భాగంలో ప్రస్తావించబడింది. జగన్మాత అంటే కృప మాతృ లక్షణం కాబట్టి, ఒక ఇంట్లో లాగ, జగత్తుకి మాతా పితా ఉన్నారు అనుకుంటే, భద్రతా భావం కలుగుతుంది కాబట్టి వైదిక సంప్రదాయంలో ఇలా భావిస్తారు అని కూడా చెప్పబడింది. 

అసలు భగవంతుడికి దయ ఉండాలా? లేక పోతే వచ్చిన నష్టం ఏమిటి? ఆయన గొప్పతనం ఏమైనా తగ్గుతుందా? అని అడగవచ్చు. 

ఆయన దయామయుడు అనుకోవడం వల్ల ఒక విధమైన సాంత్వన కలుగుతుంది.  అలా కాకుండా ఏదో మెకానికల్ గా కర్మ సాక్షి అనో, ఇంకొకటి అనో అనుకుంటే ఆ confidence  రాదు. దీనికి వేదం, శ్రద్ధయా దేవో దేవత్వం అశ్నుతే అని చెప్పింది. అసలు దేవుడి దేవత్వమే ఆయనకి మనపట్ల ఉన్న శ్రద్ధవల్ల అట.

అంతా బాగానే ఉంది. మధ్యలో ఈ స్తనాలు ఏమిటి? స్తనాగ్రాలు ఏమిటి?

శ్లోక రచయిత సంస్కృతంలో తమిళంలో మహా పండితులు. వారు వేదాంత దేశికుల వద్ద, వరవర మునీంద్రుల వద్ద అధ్యాత్మ విద్యను అధ్యయనం చేశారు. అన్నమయ్యను అర్థం చేసుకోవాలి అన్నా వారి సంప్రదాయంలోని ఈ సుప్రభాత కర్త అయిన అణ్ణన్ స్వామి వంటి వారిని అర్థం చేసుకోవాలి అన్నా ప్రాచీన తమిళ భక్తి సాహిత్యంతో, ముఖ్యంగా ఆళ్వార్ల దివ్య ప్రబంధంతో పరిచయం ఉండాలి. 

ఆళ్వార్ల కవిత్వంలో స్త్రీ స్తనాలు మనం మన పతి అయిన  భగవంతుడికే చెంది ఉండటం (భగవదేక శేషత్వం) అనే దానికి ప్రతీక. వీటిని ఒక కండలు తిరిగిన మగవాడికి, ఒక చీమకు, ఒక బండరాయికి, మొత్తం జగత్తుకు చెప్పవచ్చు. అపుడు మూర్తీభవించిన ఆయన దయాగుణమే అయిన అమ్మవారికి చెప్పడంలో ఆశ్చర్యం లేదు. 

మరి చూచుక అని (స్తనాగ్రం) అని కూడా ఎందుకు రాశారు?

ముందు కుంకుమతః అన్న దానిని చూద్దాం. కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది. పైన చెప్పబడ్డ సాహిత్యంలో ఎరుపు వాత్సల్యానికి చిహ్నం. వాత్సల్యం అంటే ఆవు తన లేగదూడని నాకే అంత అభిమానం భగవంతుడికి మనయందు ఉంటుంది. 

దయ, వాత్సల్యం ఇవి అన్నీ ఒకే విధమైన గుణాలు. కాబట్టి అతిశయించిన కరుణతో ఆయన మనల్ని తల్లిలాగ ప్రేమిస్తూ, మనం అంటే వాత్సల్యం కలిగి ఉంటాడు. 

కాబట్టి కమలాదేవి దయ, కృప, శ్రద్ధ ఇలాంటివి సూచిస్తే, ఆయనకే చెందిన ఆయన దయాగుణం అతిశయించి, ఆయన మనల్ని పుత్రవాత్సల్యంతో ఆవు తన దూడ మలిన భూయిష్టమైన శరీరాన్ని అత్యంత ప్రీతితో ఇష్టపడినట్టుగా, దగ్గరకు తీసుకుంటాడు. 

ఈవిధంగా కమల-దయ,  కుచాలు - ఆవిడ భగవంతుడి అధీనంలో ఉండటం. కుచ చూచుకం - భగవంతుడికి మనపై దయ తారాస్థాయికి వెళ్లడం. కుంకుమ - వాత్సల్యం (ఎరుపురంగు కారణంగా). 

ఇందుచేత ఆయన నీలమేఘం వంటి శరీరం ఎర్రగా మారిందిట! ఇవీ ఇందులో ఉన్న సంకేతార్థాలు. 

అందుకే ఈ ఫోటో పెట్టడం జరిగింది. ఈ ఫొటోలో ఎంత శృంగారం ఉందో, అంతే శృంగారం ఈ శ్లోకంలో కూడా ఉంది!

ప్రశ్నలు - సమాధానాలు:

---------------------------------

1. శృంగారాన్ని శృంగారంగా చూడాలి. ఇలా మార్చెయ్యడం ఏమిటి?

ముందు కవిత్వాన్ని కవిత్వంగా చూడటం నేర్చుకోండి. ఒకాయన నేను ఒక అన్నమయ్య కీర్తనకు ఇదే రకంగా  అర్థం చెపితే ఏడుపు సింబల్ పెట్టాడు, పైగా రచయితట.  కవిత్వం తెలిసిన వారు నిజానికి మనకు చెప్పాలి, poetic symbolism అనేది ఒకటి ఉంటుంది అని. 

నేను చెప్పిన సంకేతార్థాలు ఈ శ్లోక రచయిత సంప్రదాయంలో చాలా మందికి తెలిసినవే. 

దేవుడు తన కృపతో రక్షించును, ఆయనను స్తుతింపుడి అంటే అది కవిత్వం కాదు, అదేదో ప్రార్థన అవుతుంది.

2. ఇక్కడ జగత్తుకి తల్లిదండ్రుల మధ్యనే కదా చెప్పబడింది. భార్యాభర్తల మధ్య ధర్మబద్ధం అయిన శృంగారం లేకపోతే ముఖ్యంగా ఈ ప్రపంచానికి తల్లిదండ్రుల మధ్య, అసలు ఈ సృష్టి ఉంటుందా అండి?

శ్రీరామాయణంలో బ్రహ్మ "అహం తే హృదయం రామ" అని భగవంతుడితో అంటాడు. అంటే, విష్ణువు హృదయమే బ్రహ్మ. ఆయన ఎపుడు ఎలా సంకల్పిస్తే అపుడే అలాగే సృష్టి అని అర్థం. ఇంక ఈ ప్రశ్న మరీ చిన్న పిల్లల ప్రశ్నలా ఉంది. త్రిమతాలకు చెందిన మేధావులం అనుకునే వారు అడగదగ్గది కాదు. కొంచెం ఆలోచించండి. అదేదో తంత్ర శాస్త్ర గ్రంథం (నాకు ఎలా తెలుసు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో 90ల్లో ఇలాంటి భావజాల వ్యాప్తి కోసం వార పత్రికల్లో కూడా వేసే వారు) చెప్పినట్టుగా దేవీ దేవుల (శ్రీవారు, అమ్మవారు కాదు) ప్రణయం వల్ల ఈ ప్రపంచం సంభవించలేదు, శ్లోక కర్త సంప్రదాయం ప్రకారం.

3. మరి అన్యమతస్థులు, నాస్తికులు ప్రశ్నిస్తే?

పైన నేను చెప్పినది అయితే శ్లోక కర్త అధ్యయనం చేసిన సాహిత్యం ప్రకారం. లేదూ మీకు తెలిసిన పద్ధతిలో సమాధానం ఇవ్వండి. గౌరవ ప్రదమైన చర్చ ఓకే. ఎదుటి వారు దూషిస్తే పోలీసు కంప్లైంట్ ఇవ్వండి.

4. మరి శృంగార పరమైన సాహిత్యం ఆధ్యాత్మికతలో నిషేధమా?

అద్వైతులు జీవ బ్రహ్మల ఐక్యానికీ, విశిష్టాద్వైతులు జీవుడూ బ్రహ్మా (అంటే పరబ్రహ్మం) కలిసి ఆనందించడానికీ  సంకేతార్థంగా భాగవత శ్లోకాలనీ, రెండవ వారు అయితే తమిళ పాశురాలనీ ఇంకా భాగవతం మొదలైన పురాణ శ్లోకాలనీ , ఉపయోగిస్తారు. అలాగే చాలా అన్నమయ్య కీర్తనలు కూడా ఇదే కోవకు వస్తాయి. ఈ శృంగారంలో ప్రతీకలు చాలా గట్టిగా ఉంటాయి. ఎందుకంటే కాల పరిమితి ఉన్నదానికంటే అనంతంగా ఉండేది చాలా గొప్పది కదా? నిజానికి ఇది  అర్థం చేసుకున్న వారికి చాలా మంచి ఆలోచనలు కలిగి కామ క్రోధాలు తగ్గుతాయి.

Saturday, 2 April 2022

The term Anjanadri as explained by Annamayya

అన్నమాచార్య కీర్తన: అణురేణు పరిపూర్ణమైన 

రాగం: షణ్ముఖ ప్రియ

స్వరకర్త: శ్రీమాన్ వేద వ్యాస ఆనంద భట్టర్ స్వామి 

పాడిన వారు: శ్రీమతి శ్రావణి గంటి 

కీర్తన వ్యాఖ్యానంతో బాటు వినడం  కోసం ఈ క్రింది ఆడియో  లింక్ క్లిక్ చేయండి:


https://www.youtube.com/watch?v=pT6eikswZg0

పల్లవి:

అణురేణు పరిపూర్ణమైన రూపము

అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము

పరమాత్మ ముండకోపనిషత్తులో చెప్పినట్టుగా సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు. పెద్దవి అనుకునే వాటి కన్నా పెద్ద వాడు. 

భగవంతుడి సూక్ష్మ స్వభావాన్ని అంజన వర్ణత్వం అని ఆళ్వార్లు అంటారు. అంటే కాటుక రేణువులవలె సూక్ష్మమైన స్వభావం కలవాడు. 

అందుకే ఆ నల్లనయ్యని అంజన వర్ణుడు అనీ, అంజన మేని వాడు అనీ అంటారు. ఆయన పర్వతరూపిగా పూజించబడే తిరుమలని అంజన వెఱ్పు అంటారు. కాటుక కొండ లేక కాటుక స్వభావం కల సర్వేశ్వరుడు ఆరాధించబడే కొండ అని అర్థం. సర్వలోకాలకీ అంతర్యామి అయిన విశ్వరూపుడు కొన్ని మైళ్ళ పొడవైన కొండగా  ఆళ్వార్ల చేత ప్రస్తుతించబడటం కూడా ఆయన కాటుక వంటి స్వభావం వల్లనే సాధ్యం కదా. అందుకే నేడు తిరుమల శ్రీవారి ఆలయంలోని దేవుడు కొండంత దేవుడిగా కోట్లాది భక్తుల చేత నుతించబడుతున్నాడు. 

గోదాదేవి తండ్రి విష్ణుచిత్తుల వారు తన చందమామ రావే పాశురాల్లో ఇలా అంటారు. 



ఎన్ శిఱుక్కుట్టన్ ఎనక్కు ఓర్ ఇన్నముదు ఎం పిరాన్ 
తన్  శిఱుక్కైగళాల్ కాట్టిక్కాట్టి అళైక్కిన్ఱాన్
అంజనవణ్ణనోడు  ఆడలాడ ఉఱుదియేల్ 
మంజిల్ మఱైయాదే మా మదీ మగిళ్న్దోడివా!

నా చిన్ని పిల్లవాడు, నాకు అమృతం లాంటి తండ్రి, తన చిట్టి చేతులతో ఓ చందమామా! నిన్ను పిలుస్తున్నాడు. అంజనవర్ణుడైన ఈ పిల్లవాడితో ఆడాలని ఉంటే మబ్బుల వెనక దాక్కోకయ్యా! అని యశోదా భావంలో విష్ణుచిత్తులు చందమామని పిలుస్తున్నారు. 

ఇంకా తర్వాతి పాశురంలో విష్ణుచిత్తుల వారు ఇలా అన్నారు. 

శుత్తుం ఒళి వట్టం శూళ్న్దు శోది పరందు ఎంగుం 
ఎత్తనై శెయ్యిలుం ఎన్ మగన్ ముగం నేరొవ్వాయ్
విత్తగన్ వేంగడ వాణన్ ఉన్నై విళిక్కిన్ఱ 
కైత్తలం నోవామే అంబులీ కడిదోడి వా!

చుట్టూ పరచుకొన్న వెన్నెలతో ఎంతో మనోహరంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నా, మా అబ్బాయి ముఖానికి నువ్వు ఎంత చేసినా  సరి రావు.  సర్వకారణభూతుడైన నా చిన్ని వేంకటేశ్వరుడు నిన్ను తన చేతులతో పిలిచి పిలిచి అవి  ఎంత నొప్పి పుట్టాయో చూడు. ఓ చందమామా? త్వరగా రావయ్యా!

ఈ రెండు పాశురాలనీ చూస్తే, సర్వత్రా ఉన్న శ్రీనివాసుడితో పోలిస్తే చంద్రుడు చిన్న అణువు  లాంటి వాడు. స్వామి యశోద చేతుల్లో పసి బిడ్డగా మారి తన కంటే పరిమాణంలో చాలా చిన్నవాడైన చంద్రుడితో ఆడటానికి సిద్ధమయ్యాడు. అంజన వర్ణుడు కదా! 

అణిమాది అష్ట  సిద్ధులు ఉన్నాయి అని పురాణాల్లో అంటారు. ఇందులో అణిమ అంటే చాలా సూక్ష్మరూపంలోకి మారడం. అందుకే అణిమాది సిరులు ఆ అంజనవర్ణుడైన శ్రీకృష్ణుడిగా పూజించబడే అంజనాద్రికి సహజ సిద్ధమైనవి. 

చరణం 1:

వేదాంతవేత్తలెల్ల వెదకేటిరూపము
ఆదినంత్యము లేని యారూపము
పాదుగ యోగీంద్రులు భావించురూపము
యీదెస నిదివో కోనేటిదరి రూపము

వేదాంతం అంటే ఉపనిషత్తులు. వాటిని అధ్యయనం చేసిన వారు శ్రీహరి స్వభావం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ స్వామి దొరకడు. ఎందుకంటే కఠ ముండకోపనిషత్తుల్లో చెప్పినట్టు పరమాత్మ ఎవరిని వరిస్తే వారికే దొరుకుతాడు. 

యోగీంద్రులు అంటే భగవంతుడితో తమ నిత్య సంబంధం, కేవలం ఆయన దయ కారణంగా తెలుసుకొన్నవారు. వారు స్థిరంగా ఆయననే భావిస్తారు. ఎవరిని అంటే స్వామి పుష్కరిణి వద్ద ఉన్న దైవాన్ని!  తమిళంలో కోన్ అంటే స్వామి. ఏరి అంటే మడుగు. అలాగ కోనేరి అనే పదం వచ్చింది. అదే సంస్కృతంలో స్వామి పుష్కరిణిగా మారింది.

చరణం 2: 

పాలజలనిధిలోన (బవళించేరూపము
కాలపు సూర్యచంద్రాగ్నిగల రూపము
మేలిమి వైకుంఠాన మెరసిన రూపము
కీలైనదిదె శేషగిరిమీదిరూపము

స్వచ్ఛమైన పాల కడలిలో మెత్తటి శేషుడిపై యోగ నిద్రలో జగద్ రక్షణ చింతనం చేసే రూపం ఈ శేషాచల రూపమే. 

భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు 

యదాదిత్య గతం తేజో 
జగద్ భాసయతేఖిలం 
యచ్చంద్రమపి యచ్చాగ్నౌ 
తత్తేజో విద్ధి మామకం

ఈ విధంగా సూర్యుడిలోని చంద్రుడిలో అగ్నిలోని తేజస్సు శ్రీవారి రూపమే. 

శ్రీవైకుంఠంలో తన నిత్య అనుభవం కోసం వెలసినది ఈ శ్రీవారి రూపమే. వేరే శ్రీవైకుంఠం గురించి తపించక్కర్లేదు. 

వీటన్నిటికీ లోగుట్టు ఈ శేషగిరి రూపమే! సందేహం లేదు. 

చరణం 3: 

ముంచినబ్రహ్మాదులకు మూలమైనరూపము
కొంచని మఱ్ఱాకుమీది కొనరూపము
మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము
యెంచగ శ్రీవేంకటాద్రి నిదె రూపము

పరబ్రహ్మ మఱ్ఱి ఆకు మీద బాలకృష్ణుడిగా పవళించి బ్రహ్మనీ బ్రహ్మాండాలనీ సృష్టించాడు అని పురాణాలు అంటాయి.  అలాగే సృష్టి జరిగిన ప్రతిసారీ ఒక్కో బ్రహ్మని సృష్టిస్తాడు. చిన్న పిల్లవాడిగా సృష్టించాడు అని చెప్పడంలో  ఈ సృష్టి మొత్తం స్వామికి చిట్టి పాపాయి ఆట వంటిది అని అర్థం ఉంది.   

అలాంటి పరమేశ్వరుడు మమ్మల్ని ఏలడానికి శ్రీవేంకటాద్రి మీద విచ్చేశాడు. "ఈ రూపమై ఉన్నాడు ఈతడే పరబ్రహ్మము శ్రీరమాదేవి తోడ శ్రీవేంకటేశుడు" అనే అన్నమాచార్య కీర్తనే దీనికి పరమ ప్రమాణం. 

అకిఞ్చన నిధిమ్ సూతిం అపవర్గ త్రివర్గయోః
అంజనాద్రీశ్వర దయాం అభిష్టౌమి నిరంజనామ్ 

అన్నమాచార్యర్ తిరువడిగళే శరణం 
ఆళ్వార్ ఎమ్బెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం

Sunday, 3 October 2021

Allied post - Pothana's praise of the Divine Mother

పోతన భాగవత పద్యాలు - ఒక పరిశీలన

అమ్మలఁ గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలఁ బె

ద్దమ్మ సురారులమ్మకడు పాఱడిపుచ్చినయమ్మ దన్ను లో

నమ్మిన వేల్పుటమ్మలమనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా

యమ్మ కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వపటుత్వసంపదల్.


పోతన భాగవతం ప్రార్థనా పూర్వకమైన పద్యాల్లో జగన్మాత గురించి ప్రధానంగా రెండు పద్యాలు ఉన్నాయి. ఆ రెండు పద్యాలూ జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకే దేవిని ఉద్దేశించి రాసినవే అని తెలుస్తుంది.



తల్లులకు కన్నతల్లి. తిరునిన్ఱవూర్ అనే దివ్యదేశంలో లక్ష్మీ అమ్మవారి పేరు "నన్ను కన్న తల్లి"

భాగవతం ప్రకారం అయ్యవారు శ్రీమన్నారాయణుడు త్రిమూర్తులలకూ మూలమైన వాడు. అంటే బ్రహ్మకూ శివుడికి మూలం అయిన వాడు, తనకు తానే మూలం అయిన వాడు, అని అర్థం. తనకు తానే మూలం ఎలాగ అంటే, తన గురించి తెలుసుకోవడం మనకి తనవల్లే సాధ్యం కదా.
అలా అమ్మవారు లక్ష్మీ దేవి కూడా, మిగిలిన ఇద్దరు అమ్మలకీ అంటే సరస్వతికీ పార్వతికీ మూలం అయినది, తనకు తానే మూలం అయినది.
అందుకే ఆవిడ చాలా పెద్దమ్మ. రాక్షసులైన హిరణ్య కశిపు, మధువు, కైటభుడు, రావణుడు మొదలైన వారిని ఆవిడే స్వామిద్వారా సంహరింపచేసింది. అలాంటి అమ్మే మన విరోధులనుండి మనల్ని స్వామి ద్వారా రక్షిస్తుంది. దైత్యులు అరిషడ్ వర్గాలు.
తనని నమ్మిన సమస్త దేవతల మనసులోనూ ఉండి వారు మాయలో పడకుండా రక్షిస్తుంది. క్షేమానికి కారణం అవుతుంది. అలాంటి కరుణాసముద్ర దుర్గ మన మనసులో సద్బుద్ధి కలుగ చేసి భగవంతుడిని స్తుతించగలగడం అనే కలిమిని ఇచ్చుగాక!
ఇక్కడ దుర్గ అంటే "నవదుర్గామ్" అని అష్టోత్తరంలో అన్నట్టు హరికి పట్టపు రాణి అయిన మహాలక్ష్మి. భారతీ గిరిసుతలని చెలికత్తెలుగా కలిగినది.
అపుడే తర్వాతి పద్యంతో చక్కగా సమన్వయము అవుతుంది.
మాతః సమస్త జగతాం మధుకైటభారేః వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రితజన ప్రియదాన శీలే శ్రీవేంకటేశ దయితే తవ సుప్రభాతం.
మహామాయని కూడా దుర్గ అంటారు కదా, ఇక్కడ భగవంతుడికి సోదరిగా ఆవిర్భవించిన మహామాయ గురించి పోతన గారు చెప్పట్లేదా అనే సందేహం ఎవరికైనా కలగవచ్చు. అలా అయితే తర్వాతి పద్యంతో సమన్వయం కలగదు. ఒకసారి ఆ పద్యాన్ని చూద్దాం.


హరికిం బట్టపుదేవి పున్నెములప్రోవర్థంపుఁబెన్నిక్క చం
దురుతోఁబుట్టువు భారతీగిరిసుతల్ దోనాడు పూఁబోడి దా
మరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భా
సురతన్ లేములు వాపుతల్లి సిరియిచ్చున్ నిత్యకల్యాణముల్.

ముగురమ్మల మూలపుటమ్మ అమ్మలగన్న అమ్మ అలమేలు మంగమ్మ శ్రీహరికి పట్టపురాణి. పుణ్యాల రాశి. భగవంతుడిని తెలియజెప్పే గొప్ప అర్థం. క్షీర సాగర పుత్రికగా ఆవిర్భవించినపుడు చంద్రుడిని సోదరిగా కలిగినది. సరస్వతీ పార్వతులతో విలాసంగా ఆడుకొనేది. భగవంతుడి హృత్పద్మంలో అలాగే నేత్ర కమలాలలో చరణ కమలాలలో ఉండే ముగ్ధ. జగత్తులన్నీ గౌరవించే త్రైలోక్య కుటుంబిని. గొప్ప ప్రభావంతో మన కొరతలని పోగొట్టే తల్లి. అలాంటి శ్రీదేవి మనకి నిత్యమూ శుభాలని ఇచ్చుగాక!

మొదటి పద్యంలో సంపదని ఇచ్చేదీ, రెండవ పద్యంలో లేమిని పోగొట్టేదీ ఒకరే!

తవ సుప్రభాతమరవింద లోచనే భవతు ప్రసన్న ముఖ చంద్రమండలే విధిశంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైల నాథ దయితే దయానిధే.

Sunday, 19 September 2021

Viswaprakasunaku - A humble attempt to decode a deeply philosophical song

 అన్నమయ్య సంకీర్తన సంఖ్య 155సంపుటం 1

రాగము :హంసనాదం
స్వరకర్త :శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు
గానం: శ్రీమతి శ్రావణి గంటి



విశ్వప్రకాశునకు వెలియేడ లోనేడ
శాశ్వతున కూహింప జన్మ మిక నేడ //పల్లవి //













ఈ విశ్వం అంతా శ్రీమన్నారాయణుడి శరీరమే. విశ్వంలో సమస్తానికీ లోపలా బయటా ఆయన వ్యాపించి ఉన్నాడు. అటువంటి విష్ణుదేవుడికి ఏది లోపల బయట? "అంతర్ బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః" అని నారాయణ సూక్తం చెపుతోంది. సర్వత్రా ఉండి శాశ్వతుడైన వాడికి జన్మ ఏమిటి? నిజానికి రాముడిగా కృష్ణుడిగా ఆయన మనకోసం ఆవిర్భవించాడు కానీ ప్రత్యేకంగా ఎక్కడి నుంచో వచ్చి అవతారం చెయ్యలేదు. ఇది నరసింహస్వామి విషయంలో స్పష్టంగా తెలిసిందే కదా.

సర్వ పరిపూర్ణునకు సంచారమిక నేడ
నిర్వాణమూర్తికిని నిలయమిక నేడ
వుర్వీధరునకు గాలూద నొకచోటేడ
పార్వతీస్తుత్యునకు భావమికనేడ //విశ్వ //

సర్వత్ర ఉన్నవాడికి ఇంక సంచారం అనేది ఏమిటి? ఆయన ఎక్కడినుండో వచ్చి మనల్ని రక్షించాలి అని అనుకోవక్కర్లేదు. ఆయన లేని ప్రదేశం ఏది? ఆయన ఎక్కడ అనుగ్రహిస్తే అక్కడే మనకు రక్షణ. ఆయనే మోక్షస్వరూపుడు. ఇంక ప్రత్యేకంగా వేరే పరమపదం గురించి చింత ఎందుకు? వికుంఠులు అంటే భగవద్ అనుభవానికి ఏ అడ్డంకీ లేని వారు. అలాంటి వారికి లభించినవాడు కాబట్టి స్వామిని వైకుంఠుడు అన్నారు. శ్రీవిష్ణు సహస్రనామంలో అణుర్ బృహత్ కృశః స్థూలః అని ఉన్న చోట బృహత్ అన్న నామానికి అన్నమయ్య పూర్వాచార్యులైన పరాశర భట్టార్యులు "పరమాత్మ అన్న భావన ముందు పరమపదం కూడా చులకన అయి ఉంటుంది" అని తెలిపారు. ఆళ్వార్లు కానీ అన్నమయ్య కానీ, ఆంజనేయుల వారు కానీ కోరుకున్నది నిరంతరం ఆయనకి దాస్యమే కానీ ఫలానా చోటు కాదు. సమస్త భూమండలాన్నీ ఆయనే ధరిస్తున్నాడు. ఇంక ఫలానా దివ్యక్షేత్రంలో మాత్రమే ఆయన కాలు మోపాడు అని ఎలా అంటాం? అసలు మొత్తం భూమిని ఆయనే మోస్తుంటే, ఇంకా కాలు మోపడానికి ఒక ప్రదేశం మాత్రమే ఎలా దొరుకుతుంది? శ్రీవిష్ణుసహస్ర నామం పూర్వ పీఠికలో అనాది నిధనం విష్ణుం అన్న చోట విష్ణుం అన్నదానికి అదేశోపాధికం అని పరాశర భట్టార్యులు చెప్పారు. స్వామి సర్వత్ర ఉన్నవాడు కాబట్టి ఏ ప్రదేశం పైనా కూడా ఆయన అనుగ్రహం ఆధార పడి లేదు.

కేనోపనిషత్తులో దేవతలందరూ తమ విజయాలకి తామే కారణం అని గర్విస్తూంటే, పార్వతీ దేవి ప్రత్యక్షమై, అగ్నిలోని దహించే శక్తీ, వాయువులోని వహించే శక్తీ, ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మ ఇచ్చినవే అని వారికి ప్రబోధిస్తుంది. ఆవిడ ప్రత్యక్షానికి ముందు ఇంద్రుడు పరబ్రహ్మని సమీపించబోతే స్వామి అంతర్ధానం అవుతాడు. ఈ విధంగా సమస్తానికీ కారణంగా పార్వతీ దేవి చేత స్వామి చెప్పబడగా, ఆయన ఉనికి ఎక్కడో ఒక చోట అని ఎలా చెపుతాం? ఆయన గురించి ఎక్కడ అని భావన చెయ్యగలం?
 
నానా ప్రభావునకు నడుమేడ మొదలేడ
ఆనన సహస్రునకు నవ్వలివ లేడ
మౌని హృదయస్థునకు మాటేడ పలుకేడ
జ్ఞానస్వరూపునకు గానవిన వేడ //విశ్వ //

ఆయన అనాది నిధనుడు, విష్ణువు, కాబట్టి, మొదలు, మధ్య అంటూ ఏమీ ఉండదు. ప్రపంచం అంటా ముఖాలు కలిగిన వాడు కాబట్టి లోపల బయట అంటూ ఏమీ లేదు. ఏ వస్తువుకైనా లోపలా బయటా ఆయనే. తన సంకల్పంతో దేనికైనా అంతర్లీనంగా ఉంటాడు, దేని లోపలనుంచైనా వ్యక్తపరచుకోగలడు. మౌనం అంటే మనన శీలత్వం. భగవంతుడిని నిరంతరం మననం చేసే వారు మౌనులు. అటువంటి వారి హృదయంలో అంతర్యామిగా వారి బుద్ధిని గాయత్రీ మంత్రంలో చెప్పినట్టుగా ప్రేరేపించే అంతర్యామి మనకు ప్రత్యక్షమై మాట్లాడవలసిన పని ఏమి ఉంది? మనం ఆయనని తలవడం ఆయన ప్రేరణ వల్లే! ఆయన జ్ఞాన స్వరూపుడు. సర్వేశ్వరుడి జ్ఞానం అంటే సమస్త వస్తు సాక్షాత్కారం. ఇంక ఆయన ప్రత్యేకంగా వినవలసింది చూడవలసింది ఏమి ఉంది? భగవంతుడు నాకు ప్రత్యక్షం కావాలి, నా మొర వినాలి అని అనుకునే వారికి ఆచరణాత్మకమైన బోధ చేస్తూనే లోతైన జ్ఞానాన్నిఇక్కడ అన్నమయ్య అందిస్తున్నారు.
పరమ యోగీంద్రునకు పరులేడ తానేడ
దురిత దూరునకు సంస్తుతి నిందలేడ
తిరువేంకటేశునకు దివ్య విగ్రహమేడ
హరికి నారాయణున కవుగాము లేడ //విశ్వ //

యుజ్ అనే ధాతువును కలిపి ఉంచడం విషయంలో వాడతారు. సమస్త జీవులతో నిత్యం కలిసి ఉండే ఆ యోగీశ్వరుడికి పరులు అంటూ ఎక్కడ ఉంటారు? తననుండి విడిగా ఎవరూ ఉండరు.
ఆయన సమస్త దురితాలకీ దూరమైన వాడు. ఆ విధంగా ఏ దోషం లేని వాడికి స్తుతి ఏది? నింద ఏది? మన స్తుతి నిందలతో ఆయన ఔన్నత్యానికి సంబంధం లేదు.
ఇంక సర్వత్ర ఉన్న ఆ శ్రీవేంకటేశ్వరుడికి ప్రత్యేకంగా ఆలయాల్లో విగ్రహం ఎక్కడ? సమస్త విశ్వం ఆయన శరీరమే కదా!

మరి మన తృప్తి కోసం ఆయనని విగ్రహ రూపంలో అర్చించినపుడు, ఆయన రూప విశేషాలని ఆయన కళ్యాణ గుణాలకి ప్రతీకలుగా తీసుకోవాలి. మనం అర్చించే మూర్తిలో ఆ సర్వాంతర్యామి ఉన్నాడు అనే పరిపూర్ణ విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో అర్చించాలి.
పుణ్యపాపాల్ని హరించి, సమస్త విశ్వాన్నీ సంహరించే ఆ హరికి, జీవులని అందరినీ వహించే ఆ నారాయణుడికి, ఏదైనా అవడం కాకపోవడం ఎక్కడ ఉంటుంది? సంభవించే సర్వమూ ఆయన సంకల్పమే. అది ఎపుడూ అప్రతిహతమైనది.