Friday, 1 September 2023

సతి నిన్ను గెలిచెను జవ్వనపు గరిడీలో

అన్నమాచార్య కీర్తన
సంపుటి 2
-----------
సంఖ్య 517
------------
పల్లవి:
-------
సతి నిన్ను గెలిచెను జవ్వనపు గరిడీలో
మతిలోన మెచ్చి మెచ్చి మన్నించు రమణుఁడా
చరణం 1:
----------
కనుసూటి వలపు కాంత చూచిన చూపు
కొనకెక్క మరుఁడదె గురులేసెను
మొనకత్తిసామూ ములువాఁడి కొనగోరు
పెనఁగి చెక్కులనొత్తి పేరెము వారెను ॥సతి॥
చరణం 2:
----------
చేసూటి వలపూ చెలి కాఁగిలించినది
బాసతోనే కాయజుఁడు పందెమాడెను
మూసిదింపు మొరఁగూ ముంచిన పయ్యద కొంగు
ఆసలు నీకుఁ జూపి ఆయాలు రేఁచెను ॥సతి॥
చరణం 3:
-----------
మొగసూటి వలపూ మోహపు రమణి నవ్వు
తగవుతో మదనుఁడు దారగట్టెను
అగపడి శ్రీ వేంకటాధిప నీవు గూడితి
జగడమింతయుఁ దీరి చనవు చేకొనెను ॥సతి॥





వివరణ:
---------
ఇందులో కఠినమైన తెలుగు శబ్దాలకి భాషా పండితుల లేదా నిఘంటువు సహాయంతో అర్థం తెలుసుకోవచ్చు.
స్థూలంగా చూస్తే ఈ విషయం బోధపడుతుంది.
అన్నమయ్య సిద్ధాంతంలో నాయిక నాయకుడు తనను చేరుకోవాలి అని కోరుకుంటుంది కానీ నాయకుడిని చేరుకోవడానికి ఏ ప్రయత్నం చెయ్యదు. నాయకుడు నాయిక నా సొంతం అని యథేచ్ఛగా నాయికతో ఆనందించాలి. ఇది బ్రహ్మానందానుభూతి. స్త్రీ పురుషుల మధ్య శృంగారం ఒక సంకేతం మాత్రమే. జీవేశ్వరుల సంయోగం ఇంకా గాఢంగా ఉంటుంది. సంకేతార్థాలతో చెప్పబడుతుంది. వీటిని కొంచెం చెప్పి వదిలేస్తాం! అలా చెప్పీ చెప్పనట్లుగా ఉంటేనే అందంగా ఉంటుంది. ఎవరైనా మానవులకీ ఇతర జంతువులకీ సాధారణమైన తాత్కాలికమైన పరిమిత శృంగారాన్ని వెదికితే అది వారి దురదృష్టం.
ఇక్కడ నాయిక యొక్క చూపులు మన్మథ బాణాలతో సమానం అయినవి. మన్మథుడు బాణాలని నాయకుడి మీద వేసాడు. అంటే నాయిక నాయకుడి పైన కేవలం ఆభిముఖ్యం (సిద్ధాంత పరంగా ఇది కూడా ఆయన అనుగ్రహించినదే) కలిగి ఉంది. ఏ విధమైన ప్రయత్నం చెయ్యలేదు నాయకుడిని కలవడానికి.
పయ్యద కొంగు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒకటి చెప్పుకోవాలి. స్తనాలు శేషత్వాన్ని అంటే నాయిక నాయకుడికే చెంది ఉండటాన్ని సూచిస్తాయి. ఇందులో శృంగార భావన ఉందా లేదా అనేది అర్థం కావాలి అంటే ప్రాచీన భక్తి సాహిత్యం తెలిసి ఉండాలి! కుదృష్టితో పరిమిత శృంగారాన్ని వెదికే వారు అనుకునే దానికంటే చాలా ఎక్కువే ఉంది అని మాత్రం చెప్పగలను. ఇంకా పయ్యద కొంగు అంటే ఆ శేషత్వ బుద్ధి కప్పబడింది. అయితే?!
చివరిలో భగవంతుడు జీవుడిని (నాయకుడు నాయికని) కూడటం జరిగింది. అన్నమయ్య శృంగార కీర్తనల్లో సాధారణంగా ఇలాగే జరుగుతుంది.

ఇప్పుడు పల్లవిని విశ్లేషిస్తే, ఏ ప్రయత్నమూ లేకుండానే సతి పతిని "జవ్వనపు యుద్ధంలో" గెలుచుకొంది! అంటే ఆయన అనుగ్రహంతోనే వాళ్ళు ఇద్దరూ (ఆయనా, జీవుడూ) ఒక్కటి అయ్యారు అని అర్థం!
అన్నమయ్య శృంగార కీర్తనల్లో ఆధ్యాత్మికత ఏమిటి అన్నవాళ్ళు ఉన్నారు. ఇందులో నాయిక అంటే కళ్ళూ చెవులూ ఉన్న రేపో మాపో మట్టిలో కలిసే శరీరం కాదు. అదే విధంగా వేంకటేశ్వరుడు అంటే ఒక మనిషి కాదు. కాబట్టి ఇష్టం ఉన్నా లేక పోయినా తప్పదు.
ఇవి అమ్మమ్మ తాతయ్య భావనలు అసలు కాదు! అన్ని విధాలైన సాధనలనీ నిరసించి భగవంతుడు ఊరికే అనుగ్రహిస్తాడు అని చెప్పే విలక్షణమైన సిద్ధాంతం అన్నమయ్యది. దీని వల్లన జీవితంలో ముక్కు మూసుకొని తపస్సు చేస్తూ కూర్చోకుండా సాటి మానవులకి ఉపయోగపడే మనస్తత్త్వం ఏర్పడుతుంది. మనం చేసే కర్మలు కూడా ఆయన సంకల్పం వల్ల జరిగేవే అని చెప్తారు కొన్ని చోట్ల. దీనివల్లన ప్రతి దానికీ పాపం పుణ్యం అనే భయంతో కాకుండా భగవత్ ప్రేమతో, ఆయన సృష్టి మీద ప్రేమతో మనిషి నడుచుకొంటాడు.

The symbolism behind samASrayaNa ritual in Sri Annamacharya's religion

 తాళ్లపాక పెదతిరుమలాచార్య సంకీర్తన

-----------------------------------------
హరిముద్ర ధరించక అర్చించఁ బాత్రుఁడు గాఁడు...
రేకు: 0020-03,సంపుటం: 15-113
Ragam : hamsanaadam (హంసనాదం)
Singer : Pravasthi Aaradhya
Composer : Sri Vyzarsu Balasubrahmanyam garu
ఉపోద్ఘాతం:
------------
అన్నమాచార్యుల వారి ఉద్దేశ్యం ప్రకారం, భగవంతుడు నిర్హేతుక కృపతో ఊరికే ఎవరినైనా అనుగ్రహిస్తాడు. దానికి వారు వీరు అని లేదు. వాలి కావచ్చు, జటాయువు కావచ్చు, గోపికలు కావచ్చు, శిశుపాలుడు కావచ్చు.
ఈ ఆత్మ అనేది శ్రీహరికి చెందినది తప్ప స్వతంత్రమైనది కాదు. ఇలాంటి భావాలనే వారి కుమారులు కూడా కలిగి ఉన్నారు.
భగవంతుడు ఎవరినైనా అనుగ్రహించేటప్పుడు ముద్రాధారణం అనే తమ సంప్రదాయానికి మాత్రమే చెందిన ఒక ప్రక్రియపై ఎందుకు కీర్తన వ్రాసారు? ఇక్కడ విశ్లేషిద్దాం.
ఇపుడు ఒక పాత్ర మీద శంఖం చక్రం గుర్తులు వేశారు అనుకుందాం. దానిని ఎందుకు వినియోగిస్తారు? స్వామి ఆరాధనలో. అలాగే కోవెలలో ఇలాంటి పాత్రలు చూడవచ్చు.
అదే విధంగా ఆత్మ ఏ విధంగా భగవంతుడికి చెందినదో, ఆ ఆత్మని ఈ శరీరంలో ఆ భగవంతుడే పెట్టాడు కాబట్టి, ఈ శరీరం కూడా జన్మనిచ్చిన ఆ భగవంతుడిదే అని గుర్తించడమే అన్నమాచార్యుల సంప్రదాయంలో ముద్రాధారణం యొక్క ఆంతర్యం. ఆసక్తి ఉన్న వారికి ఆఖరికి బ్రిటిష్ వారి కాలంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా ఆలయ ఆచార్యులతో ఈ ముద్రాధారణ (సమాశ్రయణ) కార్యక్రమాన్ని నిర్వహించేది అని బ్రూస్ కోడ్ అనే పుస్తకం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు తెలిసినవే!
అలా భౌతికంగా ధరించకుండా కూడా ఆయన వారిమి అని తెలిసిన వారు ఎందరో ఉన్నారు. అలా ధరించిన వారిలో దుర్మార్గులూ ఉన్నారు!
మరి ఈ కీర్తన ఎందుకు?
మనం ఒక ముద్ర పడింది అని తెలుగులో అంటాం, ఆధునికులం స్టాంప్ అని కూడా అంటాం. దీని అర్థం ఏమిటి? మనం ఫలానా రకమైన వారిమి అనే కదా? అలాగే ముద్రని ధరించిన వారు అంటే, భగవదనుగ్రహాన్ని పొందినవారు అని తీసుకుంటే సరిపోతుంది.
॥పల్లవి॥
హరిముద్ర ధరించక అర్చించఁ బాత్రుడు గాడు
వెరవుగా సోదించి వినుకొండో
వివరణ: ఋచ్ - స్తుతౌ అనే ధాతువు ప్రకారం వెళితే, భగవంతుడిని స్తుతించడమే అర్చన. దానికి ఎవరు అర్హులు? ఆయన ముద్ర పడిన వారు, అంటే ఆయన అనుగ్రహానికి పాత్రులు అయినవారు అని అర్థం.
అన్నమాచార్య స్వామి వారికీ, వారి కుమారులకీ, వేదాత్ శాస్త్రాణి విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్ అన్నట్లుగా భగవంతుడే ప్రమాణం. అయినప్పటికీ, శాస్త్ర ప్రమాణం అనేది మన ritualistic societyలో అడుగుతారు (అప్పటికీ ఇప్పటికీ పెద్దగా మార్పు లేదు, ఆచార్యుల వారు మాత్రం మనకన్నా చాలా ముందు ఉన్నారు) కాబట్టి తమ సంప్రదాయంలో పై అంతరార్థం ఉన్న ప్రక్రియని ఈ విధంగా సమర్థిస్తున్నారు.
॥చ1॥
ఆరసి చక్రాంకిత మనిన మాట
ద్వారకలో కృష్ణుడన్న ధర్మము గాదా
భారతములో నున్నదే పంచమవేదమిది
సూరలుగా సోదించి చూచుకొండో
వివరణ:
ద్వారకలో ప్రవేశించే వారికీ అక్కడ ఉండేవారికీ శంఖ చక్ర ముద్రలు ఉండి తీరవలసిందే అని 5000 ఏళ్ల క్రితం పరమాత్మ శ్రీకృష్ణుడు ఒక కట్టడి చేసాడు. ఇది పంచమవేదంగా చెప్పే భారతంలో ఉంది.
॥చ2॥
తేటగా భుజచక్రద్విజాతినవని
తాటించి వైఘానసులు ధరించే ధర్మమిది
నూటొక్క ఋషులిడిన నూటొక్క సంతలందు
ఘాటముగా సోదించి కనుకొండో
వివరణ:
ముద్రలని ధరించడం అనేది శ్రీవైఖానస ఆగమానికి చెందిన వారు పాటించే ధర్మం. తిరుమలలో ఈ ఆగమం ప్రకారమే అర్చన చేస్తారు (కొందరు అపోహ పడినట్టుగా వీరు ఒక నామం, పాంచరాత్ర ఆగమం వారు మరొక నామం ధరించరు, ఇద్దరిలోనూ రెండు ఊర్ధ్వపుండ్రాలూ ఉన్నాయి). ఈ ఆగమానికి చెందిన చెందిన ఆలయాలు తిరుమల, చెన్నై పార్థసారథి ఆలయం, శ్రీపెరుంబూదూరు రామానుజాచార్య-కేశవస్వామి ఆలయం, శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ అమ్మవారి ఆలయం, మంగళగిరి, ద్వారకాతిరుమల, మొదలైనవి.
యజ్ఞో వై విష్ణు: యజ్ఞం విష్ణువే (భగవంతుడిని పొందటానికి భగవంతుడే సాధనం) అని చెప్పే యజుర్వేదం నూటొక్క శాఖలు కలిగినది. ఈ శాఖలకు చెందిన ఋషులు అందరూ హరి ముద్రలని ధరించేవారు. ఎలా అంటే, అహం వేద్మి మహాత్మానమ్ .. అని విశ్వామిత్రుడు శ్రీరామాయణంలో (బాలకాండ 19. 14) చెప్పినట్లుగా విశ్వామిత్రుడూ, వసిష్ఠుడూ మొదలైన గొప్ప యోగులు మాత్రమే కాదు, తాపసులు అందరూ శ్రీహరి భక్తులే. అన్నమాచార్య సాంప్రదాయానికి పరమవైదిక మతం అనే నామధేయం కూడా ఉంది. వీరి సాంప్రదాయ గురువులని శ్రీమద్ వేదమార్గ ప్రతిష్ఠాపనాచార్యులుగా సంబోధిస్తారు.
॥చ3॥ యెంచఁ దాపపుణ్డ్రనామ హితమంత్ర యాగమని
పంచసంస్కారము చెప్పే పాంచరాత్ర ధర్మ మిది
అంచల శ్రీవేంకటేశు ఆనతి నయిదు లక్షలు
సంచితమైన శాస్త్రము చదువు కొండో
అన్నమాచార్యుల వారి సంప్రదాయంలో ఇంకొక ప్రసిద్ధమైన ఆగమం శ్రీపాంచరాత్ర ఆగమం. వారి సాంప్రదాయ ఆలయాలు అంటే పైన చెప్పినట్టుగా శ్రీవైఖానస ఆగమం ప్రకారం అయినా ఇక్కడ చెప్పిన శ్రీపాంచరాత్ర ఆగమం ప్రకారం అయినా నడుస్తూ ఉండాలి. శ్రీరంగం, అహోబిలం, కాంచీపురం, యాదగిరిగుట్ట, సింహాచలం ఉదాహరణలు. ఇక్కడ కూడా వేరు వేరు ఊర్ధ్వపుండ్రాలని చూడవచ్చు.
ఈ ఆగమం తాప పుండ్ర నామ హితమంత్ర యాగ - అనే ఐదు సంస్కారాలు చెపుతుంది (నిజమైన సంస్కారం భగవదనుగ్రహం మాత్రమే అనే విషయం అలా ఉంచి, ఒక సంప్రదాయంలో ఉన్నపుడు కొన్ని పద్ధతులు పాటిస్తారు). ఇందులో తాపం అంటే అగ్నిలో ఉంచిన శంఖ చక్ర ముద్రలను శరీరంపై ధరించడం. పుండ్రము అంటే ఊర్ధ్వపుండ్రాలు (నామం) ధరించడం. నామం అంటే దాస్య నామం ధరించడం. నేను భగవంతుడికీ భాగవతులకీ దాసుడిని అని అర్థం. హితమంత్రం అంటే అష్టాక్షరి, ఈ మంత్రం ఉపదేశం పొందటం. ఆ తర్వాత ఈ మంత్రార్థాన్ని తెలుసుకొని ఆ అర్థాన్ని మననం చేస్తూ ఆ అర్థానికి తగినట్లుగా జీవించడం. అష్టాక్షరి కన్నతల్లి కంటే ఉపకారం చేస్తుంది అంటారు. ఈ మంత్రం పైన చెప్పిన శ్రీవైఖానస ఆగమంలో కూడా చాలా ముఖ్యమైంది. యాగం అంటే దేవపూజనం. ఇకపైన శిష్యుడు చేసే పూజ అంతా తన ఆచార్యుడు చేయిస్తున్నట్టుగా భావిస్తూ చెయ్యాలి.
రెండవ చరణంలో చెప్పిన శ్రీవైఖానసం, మూడవ చరణంలో చెప్పిన శ్రీపాంచరాత్రం, రెండూ శ్రీవేంకటేశ్వరుడు అంటే శ్రీమన్నారాయణుడు ఆనతి ఇచ్చినవే.
ఇక్కడ అయిదు లక్షలు అనే సంఖ్య ఎలా వచ్చింది అనే నా సందేహాన్ని భద్రాచలం ఆలయ వేదపండితులు శ్రీమాన్ ఉ.వే.ప్ర. గుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్య స్వామి వారు తీర్చారు. వారికి అనేక నమస్సులు.
శ్రీపాంచరాత్రం పాద్మ సంహితలో (తిరుచానూరు అలమేలు మంగమ్మ వారి ఆలయంలో దీని ప్రకారమే అర్చనలు చేస్తారు) ఇలా ఉంది:
సార్ధకోటి ప్రమాణేన బ్రహ్మణా కేశవాత్ సృతమ్
కపిలాయ దదౌ బ్రహ్మా లక్షాణామ్ పఞ్చకమ్ తతః
కోటీ యాభై లక్షల శ్లోకాల శ్రీపాంచరాత్ర ఆగమాన్ని కేశవుడు బ్రహ్మకి ఉపదేశించగా, బ్రహ్మ మళ్ళీ ఆ కేశవుడి అవతారమే అయిన కపిలమహర్షికి ఐదు లక్షల శ్లోకాలతో ఉపదేశించాడు. ఇప్పుడు అన్ని ఉన్నాయో లేదో తెలీదు కానీ, 103 సంహితలతో శ్రీపాంచరాత్రం "చరితమ్ రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్" అన్నట్లుగా విలసిల్లుతోంది.

Saturday, 27 May 2023

సముఖా హెచ్చరిక ఓ సర్వేశ్వరా

అన్నమాచార్య కీర్తన: సముఖా హెచ్చరిక ఓ సర్వేశ్వరా

రాగం: ఖమాస్

స్వరకర్త : శ్రీ మల్లాది సూరిబాబు గారు
గాత్రం : శ్రీరామ్ & గణేష్ (బాలబ్రదర్స్ )

|పల్లవి||సముఖా హెచ్చరిక ఓ సర్వేశ్వరా
అమరె నీ కొలువు ప్రహ్లాదవరదా



Oh Supreme Lord with a wide open mouth! The Lord Who bestowed the best on Prahlada! Be ready! Your court just begins.
(Note: Vara means the best, not just boon. Samukha is one who has a wide open mouth, standing for the Lord's lion face here).
||చ1|| తొడమీద గూచున్నది తొయ్యలి ఇందిరాదేవి
బడి చెలులు సోబాన పాడేరు
నడుమ వీణె వా‌యించీనినారదుడల్ల వాడె
అడరి చిత్తగించు ప్రహ్లాదవరదా
Sits on Your lap, the Supreme Goddess (Parameswari) Lakshmi, with goddesses accompanying Her singing in the praise of You both. In between, Narada palys his Veena. Listen carefully, Oh Narasimha Who graced Prahlada!
(Ind-means paramaiswarya per its Sanskrit root, Indira stands for the Supreme Goddess Lakshmi).
||చ2|| గరుడోరగాదులు ఊడిగములు నీకు జేసేరు
ఇరుమేలా గొలిచేరు ఇంద్రాదులు
పరమేష్టి ఒకవంక పనులు విన్నవించీ
అరసి చిత్తగించు ప్రహ్లాదవరదా
Garuda and Sesha are serving You. Indra and others are assembled on either side of You and are paying obeisance to You. Brahma is submitting what needs to be done today, awaiting Your orders. Know that and pay attention, Oh Narasimha Who graced Prahlada!
||చ3|| పొదిగొని మిమ్మునిట్టే పూజించేరు మునులెల్లా
కదిసి పాడేరు నిన్ను గంధర్వులు
ముదమున అహోబలమునను శ్రీ వేంకటాద్రి -
నదె చిత్తగించుము ప్రహ్లాదవరదా
All the sages are worshipping You spontaneously, and Gandharvas are singing Your glory. Listen to it in Ahobilam and on Sri Venkatadri. Listen with rapt attention, Oh Narasimha Who graced Prahlada!

Thursday, 25 May 2023

Annamacharya's Srungara Keertanas - An analysis


అన్నమాచార్యుల వారి శృంగార కీర్తనలు - ఒక పరిశీలన
-----------------------------------------------------------------------
పురాణేతిహాసాల్లో నేను విన్నంత వరకూ, శ్రీవారికీ, అమ్మవారికీ మధ్య శృంగార పరమైన వర్ణనలు అంటూ లేవు. అన్ని చోట్ల ఉన్నవాడికీ, ఆయన దయకీ (motherly aspect) మధ్య ఎలా వర్ణిస్తారు? వారి సంబంధం నిత్యమైనది తప్పించి మానవపరమైన బంధం లాంటిది కాదు.
అమ్మవారు శ్రీవారిని కౌగిలించుకుంది అని చెప్పడానికి కూడా వాల్మీకి మహర్షి పెద్ద వివరణ ఇస్తాడు (శ్రీరామాయణం అరణ్యకాండ 30.39)
తమ్ దృష్ట్వా శత్రుహన్తారం మహర్షీణాం సుఖావహం
బభూవ హృష్టా వైదేహీ భర్తారం పరిషస్వజే!
రాములవారు 14000 మంది రాక్షసులని సంహరించి మహర్షులకి సంతోషం కలిగించినపుడు అమ్మవారు ఆయనని హర్షంతో కౌగిలించుకుంది.
భాగవత విరోధులని (మన అహంకార మమకారాలు - ప్రతీకాత్మకంగా) ఆయన తొలగించి భాగవతోత్తములైన మహర్షులకి సుఖాన్ని (భగవద్ అనుభవాన్ని) ప్రసాదించినపుడు, విదేహ సంబంధమైన ఆయన కృప ఆయనని కౌగిలించుకుంది - ఇదీ అంతరార్థం. భగవత్ కృప వల్లే దేహ భ్రాంతి పోతుంది. అలాంటి దేహ భ్రాంతి లేని (విదేహ) రాజర్షుల వంశానికి చెందిన సీతని వైదేహి అంటారు.
అన్నమాచార్యుల శృంగార కీర్తనలని నేను చాలా చూసాను. కాస్తో కూస్తో తెలుగూ సంస్కృతం వచ్చి (కొందరికి చాలా బాగా వచ్చు), అటు అద్వైతంతో కానీ, అన్నమాచార్యుల వైష్ణవంతో కానీ పెద్దగా పరిచయం లేని వారు టన్నుల కొద్దీ వ్యాఖ్యానాలు రాసెయ్యడం వల్ల ఆయన శృంగార కీర్తనలు అమ్మవారికీ అయ్యవారికి మధ్యవిగా ప్రచారం పొందాయి.
కానీ ఎక్కువ శాతం నేను చూసిన కీర్తనలు జీవుడికీ, దేవుడికీ మధ్యవి. అయితే, వ్యాఖ్యానాలు రాసినవారిలో అధికశాతం అటు అద్వైతులూ కారు, ఇటు అన్నమయ్య సంప్రదాయస్థులూ కారు. బహుదేవతారాధకులైన కర్మసిద్ధాంతపరులు. అది కూడా ఈ ఆధునిక కాలంలో వారికి నచ్చిన పూజలూ, పునస్కారాలూ చేసుకునేవారు, ఒక పద్ధతిగా ఇంతకు ముందులాగ సంధ్యావందనం, అగ్నిహోత్రం వంటివి కాకుండా. అందువల్ల ఈ విషయం ఎక్కువ బయటకు రాలేదు.



శృంగారాన్ని శృంగారంగా చూడండి అని నాకు చెప్పిన వాళ్ళు, చెప్పే వాళ్ళు ఉన్నారు.
ముందు కవిత్వాన్ని కవిత్వంగా చూడండి అని వారికి నా సలహా. కవిత్వంలో ఏదీ డైరెక్టుగా చెప్పబడదు. దేవుడు తప్పక అనుగ్రహించును, అతనిని నమ్ముడి, అంటే అది కవిత్వం కాదు. ఏదో ప్రార్థన అవుతుంది!
అన్నమాచార్యుల సిద్ధాంతంలో ప్రతీకాత్మకంగా అందరూ స్త్రీ ప్రాయులే. భగవంతుడు ఒక్కడే పురుషుడు. ఇది ఏ మాత్రం అసహజమైనది కాదు, జీవుడికి కాళ్ళూ కళ్ళూ లేవు. భగవంతుడు సమస్త ప్రపంచమూ నిండి ఉంటాడు. కాబట్టి తప్పుగా ఊహించడానికి ఏమీ లేదు! బ్రహ్మానందానికి ఒక మానవపరమైన పోలిక మాత్రమే.
జీవుడికి ఈశ్వరుడికి మధ్య సంబంధాన్ని చెప్పే అన్నమయ్య so called శృంగార కీర్తనల్లో consistency, pattern ఉంటాయి. వీటిని నేను అప్పుడప్పుడు పెట్టిన పోస్టుల నుంచి కూడా చూడవచ్చు.
బహుశా కాళిదాసు కుమారసంభవం వ్రాసినప్పటి నుండీ, ఆయనని అందరూ మహాకవిగా గౌరవించడం వల్ల, ఆయా సంప్రదాయాల్లోని దేవుడికీ అమ్మవారికీ మధ్య శృంగార పరమైన సాహిత్యం అందరూ మొదలు పెట్టారు. దీనికి కొన్ని కీర్తనల్లో అన్నమాచార్యులు కూడా మినహాయింపు కాదు.
భగవంతుడికి అమ్మవారికీ మధ్య వర్ణన చేసినప్పుడు అన్నమాచార్యులు అమ్మవారి పేరు నేరుగా ప్రస్తావిస్తారు. అలాగే జీవుడి విషయంలో చెప్పినట్టుగా అశక్తత, అజ్ఞానం, అసూయ (ఇంకో స్వామి భార్యని - అంటే మరొక జీవుడిని ఈర్ష్య పడటం), ఇలాంటివి అమ్మవారి పరంగా అన్నమయ్య చెప్పరు. ఇంకా నాయిక వర్ణన గంభీరంగా ఉంటుంది.
భగవంతుడికి అమ్మవారికి మధ్య చాలా శృంగార కీర్తనల్లో కూడా సందేశం ఉంటుంది. వాటిలో సంకేతార్థాలని అర్థం చేసుకుంటే తెలుస్తుంది. కొన్నింటిలో మాత్రం నాకు సందేశం కనిపించలేదు. బహుశా నేను అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చు, లేదా, ఆ కీర్తనలు కేవలం వేడుకగా పాడినవి కావచ్చు

Saturday, 24 September 2022

Entha Matramuna Evvaru Talachina

 అన్నమాచార్య కీర్తన: ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన

పాడిన వారు: గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు
స్వరకర్త: కడయనల్లూర్ వెంకటరామన్ (ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు మొదట పాడినప్పుడు)
రాగం: బృందావని+మాయా మాళవ గౌళ రాగం
క్లుప్త వివరణ:
ఈ పాట అర్థం చేసుకోవడానికి చాలా మటుకు సులభంగానే ఉంది. అయితే ఒకటి రెండు సందేహాలు రావచ్చు.
  1. మొదటి చరణంలో విష్ణువును మొదట ప్రస్తావించి తర్వాత పరబ్రహ్మాన్ని ఎందుకు చెప్పారు అని.
  2. పిండంతే నిప్పటి అంటే ఏమిటి? నిప్పటి ఒక రాయలసీమ వంటకం. మరి వివిధ దైవాల గురించి, సామరస్యం గురించి చెపుతో పిండి కొద్దీ వంటకం అని ఎందుకు అంటున్నారు? ఈ సందేహం కూడా కలుగవచ్చు.
వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి ఆయనను విష్ణువు అన్నాయి. విష్ణువు అనగానే వేదాల ప్రకారం త్రివిక్రముడు, ఇంకా పురాణేతిహాసాల ప్రకారం నరసింహుడు, రాముడు, కృష్ణుడు మొదలైన అవతారాలు ధరించి అందరిలో కలసి ఒకడిగా తిరగడం, ఆయన మహత్తుని మనకు తెలియచేయడం, మనకు తాను ఉన్నాను అనే ఆశ్వాసనని ఇవ్వడం, ప్రేమ, దయ, వాత్సల్యం వగైరా వస్తాయి. ఎక్కడి వరకూ అంటే శ్రీవేంకటేశ్వరుడు మొదలైన రూపాల్లో ఆలయంలో మనల్ని అనుగ్రహించే దాకా!
అయితే వేదాల శిరోభాగమైన ఉపనిషత్తులు పరబ్రహ్మం అని, బ్రహ్మం అనీ తరచూ అంటూ ఉంటాయి. దీనిని అధ్యయనం చేసినవారు వారు భాగవతోత్తములు కావచ్చు, కాకపోవచ్చు, అపుడు వివిధ రకాలుగా భావించే అవకాశం ఉంది. అంతే కాకుండా పైన చెప్పిన గుణాలు అన్నీ పరబ్రహ్మం అన్నంత మాత్రాన ప్రకాశించవు. పరబ్రహ్మం అనే మాట ఆయన ఔన్నత్యాన్ని మాత్రమే చెపుతుంది. అందుకే మొదట విష్ణువు పేరు చెప్పారు.
ఇంక ఆఖరులో నీ వలన కొరతే లేదు, నీరు కొలది తామరవు అని చెప్పారు. పైగా గంగలోనూ, బావుల్లోనూ ఒకే జలం ఊరినట్టుగా దైవం ఒకటే అని చెప్పారు. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఆయన ఒకే దేవుడి గురించి చెప్పారు!
విష్ణువు అన్నప్పుడు ఒక వర్గానికి చెందిన దైవంగా కాకుండా సర్వవ్యాపి అయిన పరిపూర్ణ దైవంగా తీసుకోవాలి. ఇంక పరబ్రహ్మం అంటే ఆయన ఔన్నత్యాన్ని సూచించే పదమే! శివుడు పరమాత్మ సంహార మూర్తి. భైరవుడు ఆ శివుడి అంశమే. శక్తి పరమాత్మ మాయయే.
ఇలా భగవంతుడి కంటే వేరైన విషయాల్ని అసలు అన్నమయ్య ప్రస్తావించనే లేదు. అందుకే భగవంతుడిని అన్ని చోట్ల ఉన్న ఒకే జలంతో పోల్చారు.
దైవాలని భౌతికంగా ఊహించుకున్న వారే విష్ణువనీ, శివుడనీ, శక్తి అనీ, కాదు ఇద్దరో ముగ్గురో ఒకటే అనీ, దెబ్బలాడుకుంటుంటారు. వీరిలో ఎవరి నమ్మకం వారికి ఉన్న ఉత్తములూ ఎందరో ఉన్నారు.
పల్లవిలో "పిండంతే నిప్పటి అన్నట్టు" అని చెప్పడంలో అంతరార్థం ఇదే!
Brief Description:
-------------------
This song is pretty much easy to understand for those knowing Telugu. However one can have two doubts.
1. Why in the first stanza Vishnu is mentioned first and then Parabrahman?
2. What is "pinDanthE nippaTi" or a dish called "nippaTi" according to the quantum of flour? NippaTi is a Rayalaseema dish. In a song that mentions various deities and talks about harmony, why is it said that dish as per the flour available? This doubt can
also arise.
The Vedas, epics and purANas call Lord Vishnu because he is omnipresent. Vishnu, who is Trivikrama according to the Vedas, according to purANas and itihAsas, takes in the incarnations of Narasimha, Rama, Krishna, etc., mingling with us easily, letting us know His greatness, giving us the assurance that He is there for us, showing love, kindness, affection, and so on.
This goes on to the extent of blessing us in temples in the form of Sri Venkateswara etc.
However, the Upanishads, considered to be the head of the Vedas, often refer to Him as Parabrahman and Brahman. Those who have studied it may or may not be great Bhagavatas, then it is possible that they think differently.
Apart from that, not all of the above qualities shine by saying He is Parabrahman. The word Parabrahman only speaks of his exalted stature. That is why Vishnu's name was mentioned first.
And in the end is is said that there is no shortage because of You, the Supreme Lord and You are like a lotus that grows according to the plentifulness of water. Moreover, it is said that God is the same as the same water in the Ganges and wells. Take a closer look and he says the same God and not different deities!
Vishnu should be taken to be the omnipresent perfect deity rather than a sectarian deity. Parabrahman is the word that signifies His exaltation! Lord Shiva is the divine slayer. Bhairava is an aspect of that Shiva. Shakti is the will or Maya of Vishnu.
Thus Annamayya does not mention anything other than the Supreme Being. That is why God is compared to the same water present everywhere. If you think He is in Ganga, He is in Ganga. If you think He is in a well, He is in a well. As simple as that.
పల్లవి:
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు
చరణం 1:
కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు
చరణం 2:
సరి నమ్ముదురు శాక్తేయులు, శక్తి రూపు నీవనుచు దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు గరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు
చరణం 3:
నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగీరథి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని ఈవలనే నీ శరణనియెదను, ఇదియే పరతత్వము నాకు
Audio link below:


Sunday, 11 September 2022

The divine mother the personification of His grace is the sole refuge for all

 ॥పల్లవి॥ శ్రీసతికరుణే దిక్కు జీవుల కెల్లా

వాసుదేవుఁడా రమణీవశమైయుండఁగను


భగవద్ రామానుజుల వారు అశరణ శరణ్యామ్ అని శరణాగతి గద్యంలో చెప్పినట్టుగా భగవత్కరుణ శ్రీదేవి మాత్రమే జీవులందరికీ దిక్కు. 

శ్రీయతే ఇతి శ్రీ, శ్రయతే ఇతి శ్రీ, అంటే, మనల్ని భగవంతుడికి ఆశ్రయింపచేసేదీ, భగవంతుడిని నిరంతరం ఆశ్రయించి ఉండేదీ, జగన్మాతే. 


శ్రీవాసుదేవ మహిషీ పుంప్రధానేశ్వరేశ్వరీ అని లక్ష్మీ సహస్రనామాల్లో చెప్పినట్టు అమ్మవారు పురుషోత్తముడైన వాసుదేవుడికి కూడా ఈశ్వరి. భగవంతుడు తన కృపకి తానే వశం అయి ఉంటాడు అని అర్థం. ఈ విధంగా అన్నమయ్య కీర్తనల్లో ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది. 

క్షీరాబ్ధౌ శ్రీర్యథా జాతా పూర్వం భృగు సుతా సతీ అన్నది శ్రీవిష్ణుపురాణం. పూర్వం భృగుమహర్షి కూతురుగా ఆవిర్భవించిన సతి శ్రీదేవి క్షీరాబ్ధి కన్యకగా వచ్చింది అని అర్థం.  

 సత్తా అంటే అర్థవంతమైన ఉనికి అని అర్థం. భగవంతుడి లాగే శుద్ధసత్త్వరూపిణి అయిన లక్ష్మీదేవిని అందుకే శ్రీసతి అంటారు. 

అదే విధంగా  భర్త జీవితానికి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి భార్యని సామాన్య పరిభాషలో  సతి అని పిలుస్తారు. 


॥చ1॥ సీతవద్దనుండ రాముచేఁ గాకాసురునకు

నాతలఁ బ్రాణము నిల్చె నపరాధియైనాను

యేతుల రావణాసురుఁ డిటువంటివాఁడే కాఁడా

కాతరాన నొంటిఁ జిక్కి పిండతుండా లాయెను


కాకాసురుడికి లోకాలన్నిట్లో ఎవరూ శరణు ఇవ్వకపోతే అపుడు సీతాదేవితో కూడిన రాముడినే ఆశ్రయిస్తే రాముడు రక్షించాడు. 

రావణాసురుడు అహంకారంతో సీత తన అధీనం కావాలి, రాముడు వద్దు అనుకున్నాడు. ఏమైందో తెలిసినదే. 

॥చ2॥ కదిసి రుక్మిణి యుండఁగాఁ గృష్ణునిచే రుక్మికి

అదన బ్రదుకు గల్గె నతిద్రోహి యైనాను

యెదుటనే శిశుపాలుఁ డీరీతివాఁడే కాఁడా

తుద సభలో వదరి తునకలై పడెను


రుక్మిణీదేవితో కలిసి శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్తుండగా అడ్డు వచ్చిన రుక్మిని అమ్మవారు ప్రార్థిస్తే కృష్ణుడు చంపకుండా అతని జుట్టూ గడ్డమూ మీసాలూ ఒకవైపు కోసేసి పరాభివించి వదిలేస్తాడు. 


అదే కృష్ణుడు ఒక్కడూ వెళ్లిన రాజసూయ యాగంలో శిశుపాలుడి నూరవ తప్పుకి అతనిని చంపివేస్తాడు. 


॥చ3॥ సిరితోడ పైనుండఁగ శ్రీనరసింహుచే దైత్య

గురుపుత్రులు నిలిచిరి క్రూరకర్ము లైనాను

పరగ శ్రీవేంకటేశుపగ గాఁడా హిరణ్యుఁడు

గరిమ నదరిపాటుగాఁగాఁ బొలిసెను

శ్రీదేవి నరసింహ స్వామి తొడపై ఉండగా దైత్య గురు పుత్రులు అంటే హిరణ్యకశిపుడి ఇతర కుమారులూ, ప్రహ్లాదుడి గురువు కుమారులూ, మొదలైన వారు కావచ్చు. వాళ్ళు ప్రహ్లాదుడిని ఎంత హింసించిన వారైనా భగవంతుడు వీరందరూ నిజానికి నా పిల్లలే కదా అని దయతో వదిలేసాడు. 


అదే తాను ఆవిర్భవించినపుడు హిరణ్యకశిపుడిని మాత్రం అప్పటికప్పుడే చీల్చి వధించాడు. 


శూర్పణఖ సీత వద్దు రాముడే కావాలి, ఈమె ఏదో మానవస్త్రీ, నాకు ప్రతిబంధకమైనది అనుకున్నట్టుగా, లక్ష్మీదేవి లేని నారాయణుడు రక్షిస్తాడు, ఆయనే కావాలి, ఈవిడ ఎవరో ఒక దేవత మాత్రమే, అని భేద భావంతో వేరుగా తలిచేవారికి ఈ కీర్తన చక్కని బోధ. 

Click below for a link to an audio visual:





Ksheerabdhi Kanyakaku

అన్నమాచార్య కీర్తన:
*క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహలక్ష్మికిని*
*నీరజాలయకును నీరాజనం*

గానం: శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు
రాగం: మధ్యమావతి
రేకు: 1050-1
సంపుటము: 20-295
రేకురాగము: మంగళకౌశిక

పల్లవి:
క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం

చరణం1:
జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువు మాణిక్యముల నీరాజనం

చరణం2:
చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివ నిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం

చరణం3:
పగటు శ్రీ వేంకటేశు పట్టపు రాణియై
నెగడు సతి కళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కఁదనములకెల్ల
నిగుడు నిజశోభనపు నీరాజనం

వివరణ:
సులభంగానే పదాలు ఉన్నాయి కాబట్టి పెద్దగా రాయట్లేదు.

పల్లవి:
ఇందులో క్షీరాబ్ధి కన్యకకు అంటే అంతకు ముందు అమ్మవారు లేదా అనే సందేహం వస్తుంది. భగవంతుడితో పాటు నిత్యమూ ఉండే ఆయన కృప సృష్టి జరిగాక మొదట భృగు మహర్షి కూతురిగా ఆవిర్భవించింది. దేవతలు కష్టాల్లో ఉన్నపుడు వారిని అనుగ్రహించడం కోసం మళ్ళీ క్షీరసముద్రంలో ఆవిర్భవిస్తుంది.
భృగోః ఖ్యాత్యాం సముత్పన్నా శ్రీః పూర్వముధధేః పునః
దేవ దానవ యత్నేన ప్రసూతామృత మంథనే|
అని శ్రీవిష్ణుపురాణం చెపుతోంది. భాగవతం కూడా ఇదే చెప్పింది.

లక్ష్మి అంటే అర్థం గతంలో నా పోస్టుల్లో చూసాం. ఒక్క ముక్కలో లోకమాత అని అర్థం చెప్పుకోవచ్చు.

చరణం1:
పద్మాలు మార్దవానికి చిహ్నాలు. నేత్రాలని పోల్చినపుడు సర్వాన్నీ దర్శించే సామర్థ్యాన్ని చెపుతాయి.
జలజాక్షి ముఖం కూడా జలజమే!

కుచాల గురించి గతంలో చెప్పాను. అమ్మవారికి అయినా, ఒక మగవాడికైనా, ఒక జడవస్తువుకి అయినా భగవంతుడికి మాత్రమే చెంది ఉండటం అనే లక్షణాన్ని సూచిస్తాయి. భగవంతుడు భర్త!

కొప్పు జ్ఞానానికి ప్రతీక. ఇంక వరద అభయ హస్తాల గురించి చెప్పక్కర్లేదు.

చరణం2:
పాదపద్మాలు (చరణ కిసలయమ్ములు) శ్రీమన్నారాయణుడి శరణ్యత్వానికి చిహ్నాలు.

అమ్మవారు ఆశరణ శరణ్య అయితే భగవంతుడు అనాలోచిత విశేష అశేష లోక శరణ్యుడు (భగవద్ రామానుజులు చెప్పినట్టుగా). శరణు లేని వారికి ఆవిడ శరణం అయితే, ఏమీ ఆలోచించకుండా సమస్త లోకాలకీ ఆయనే శరణు! ఇంక ఇద్దరికీ తేడా ఏమిటి? అందుకే పెద్దలు ఒక ప్రత్యేక దేవతగా కాకుండా మూర్తీభవించిన భగవత్ కృపగా చెపుతారు.

ఊరు అంటే ఆధారం అయినది. రంభ అంటే వెదురు. రంభోరు అంటే వెదురు వంటి బలహీనమైన తొడలు లేదా మోకాలికీ పాదానికీ మధ్య భాగం కలిగినది అని చెప్పవచ్చు. అంటే భగవంతుడే తప్ప వేరే ఆధారం లేనిది ఆయన కృప.

అయ్యవారు కల్పవృక్షం అయితే అమ్మవారు కల్పలత అని శ్రీవిష్ణుపురాణం.

జఘనం అన్నా ఇదే అర్థం వస్తుంది. జఘనం రాగానికి కూడా చిహ్నం. అరిది జఘనం అంటే అరుదైన అంటే ఉందీ లేదా అన్నట్లు ఉన్న నడుము! అమ్మవారికి అయ్యవారిపై ఎంతో రాగం ఉన్నప్పటికీ, అయ్యవారి రాగంతో పోలిస్తే అమ్మవారి ఉండీ లేనట్టుట! అమ్మవారి విషయంలో నహి నిందా న్యాయం. జీవుల విషయంలో సహజం. అందుకే అన్నమయ్య నాయికా భావంలోని శృంగార కీర్తనల్లో కూడా సన్నని నడుముగా చెపుతారు జీవుడికి.

ఇంకా అమ్మవారికి అయ్యవారిపై ఆధార పడటమే తప్పించి ప్రత్యేకంగా అస్తిత్వం లేదు అని నేను చక్కని తల్లికి చాంగుభళా కీర్తనలో రాసిటనట్టు కూడా జఘనం (నడుము) విషయంలో చెప్పవచ్చు. దీనికి స్త్రీ పురుషుల్లో ఎవరు గొప్ప ఇలాంటి అర్థాలు తియ్యకూడదు. భగవంతుడు స్త్రీ పురుషనపుంసక భేదాలకి అతీతుడు.

నాభి అంటే కేంద్రం. భగవదనుగ్రహానికి ఆయన దయే మూలం!

చరణం3:
పట్టపు రాణి అని ఎందుకు అన్నారు అంటే, భగవంతుడికి ప్రపంచంలో ఉన్నవారు అందరూ భార్యలే! అయితే సమస్త విశ్వంలో ఉన్న జీవుల పట్ల ఆయన దయ లేదా శ్రద్ధని శ్రీదేవిగా, భూలోకంలో ఉన్న మన అందరి పట్ల శ్రద్ధని భూదేవిగా, ప్రతి ఒక్క జీవి పట్ల ఉన్న శ్రద్ధని నీళాదేవిగా చెపుతారు. అంచేత శ్రీదేవి పట్టపురాణి!

Click here for an audio visual: