Wednesday 19 February 2020

Serving His devotees superior to serving Him

ఉన్నమాట లిక నేల వో దేవా
యెన్నటి కిదేమాట యింకా నింకాను                   // పల్లవి //

వివరణ:

శ్రీ విష్ణు సహస్రనామంలో విజితాత్మా విధేయాత్మా అన్నట్లుగా పరమాత్మ తన భక్తులకి తానే విధేయుడు. భగవదనుగ్రహంతో భగవంతుడిని ఆశ్రయించినవారు కర్మపాశానికి బద్ధులు కారు. దీనినే శరణాగతి అంటారు. 

భగవంతుడిని ఆశ్రయించడం కన్నా భాగవతులని ఆశ్రయించడం ఉత్తమమైనది. అలా భాగవతులని ఆశ్రయించినవారు ఎన్నటికీ చెడరు. వేరే ఎన్నో మాటలెందుకు? నన్ను నీ దాసుల దాసుడిగా ఎప్పటికీ పరిగణించి ఏలుకో అంటున్నారు అన్నమయ్య. 

చరణం 1:


కొంత నా కర్మఫలము కొంత నీ రక్షకత్వము
యింతలో రెండు గలవా యేమో దేవా
అంతర్యామివి నీవు ఆడేటిబొమ్మను నేను
చెంతఁ గాచుట నీపని సేవసేయ నాపని         // ఉన్న //

వివరణ:

నా పుణ్యపాప ఫలాల వల్ల భవబంధాల్లో కొంత ఇరుక్కున్నాను అంటారు. నీ రక్షకత్వం వల్ల నీకు కొంత దగ్గరవుతున్నాను. నిజంగా నువ్వు రక్షకుడివైతే నేను కర్మబంధాల్లో ఇరుక్కుంటానా?  సర్వాంతర్యామిగా నీవు నన్ను ఆడిస్తున్నావు. నేను నీ చేతిలో ఆడే బొమ్మనే తప్ప నాకు స్వాతంత్య్రం ఏమీ లేదు. నన్ను రక్షించే బాధ్యత నీదే. నీ దాసులకు సేవ చెయ్యడం నాకు సహజమైన విధి. "అంతర్యామివి నీవు ఆడేటిబొమ్మను నేను" అనడం  "ఈశ్వరః సర్వ భూతానాం హృద్దేశే అర్జున! తిష్ఠతి, భ్రామయన్ సర్వ  భూతాని యంత్రారూఢాని మాయయా" అన్న గీతా శ్లోకం యొక్క సారాంశం. 

చరణం 2:


నే నపరాధి నయ్యేది నీవు వహించు కొనేది
యీ నెపాలు రెండూ నేల యేమో దేవా
మానక యిట్లయితే నీ మహిమకు గురుతేది
ఆని చింతించే నందుల కపకీర్తి యనుచు     // ఉన్న //

వివరణ:

నేను అపరాధ చక్రవర్తిననీ నీవు దయతో నన్ను రక్షించే భారాన్ని వహిస్తావు అనీ అంటారు. ఈ రెండూ ఎందుకు? నీ చేత రక్షించబడితే నేను అపరాధాలు ఎందుకు చేస్తాను? ఇలా అయితే నీకు అపకీర్తి రాదా? దీనికి ముగింపు పలకకపోతే ఇంక నీ మహిమ ఎలా తెలుస్తుంది?  అని చింతిస్తున్నారు అన్నమయ్య. 

చరణం 3:


మెదలే నా యధమము మీ ఘనత యెంచి కావు
యిదియే నా విన్నపము యేమో దేవా
యెదుట శ్రీవేంకటేశ యిన్నిటా నీ బంటు బంట
పదివేలు నా నేరాలు పట్టకుమీ యిఁకను    // ఉన్న //

వివరణ:

ఇకముందు నేను అనేక పక్కదోవలు పట్టే ముందే నా అధమ స్థితినీ మీ - అంటే నీ యొక్క ఇంకా నీ దేవేరి జగన్మాత యొక్క ఘనతనీ గుర్తుపెట్టుకొని మీ బాధ్యతగా నన్ను రక్షించు. ఓ శ్రీవేంకటేశా! అన్ని విధాలా కూడా నేను నీ దాసులకు దాసుడిని. వారికి దాస్యం చెయ్యడానికి నాకు అడ్డంకులైన నా గత అపరాధాల్ని లెక్కించకు అని ప్రార్థిస్తున్నారు అన్నమయ్య. అన్ని చోట్లా నీవు అని, ఇక్కడ మీరు అనడంలో  జగత్తుకి తల్లిదండ్రులైన లక్ష్మీ నారాయణులిద్దరినీ వేడుకోవడం తెలుస్తోంది. భాగవతోత్తములు కరుణించి తమవాడు అనుకున్న వాడిని వారికి విధేయుడైన స్వామి ఇక రక్షించక తప్పదు కదా!

Click here for a link to audio by Smt Sravani Ganti

Sunday 2 February 2020

Lord riding the Sun

*సూర్యప్రభ సంకీర్తనం*

॥పల్లవి॥విపరీతము లివి వినరాదు
వుపమలెల్ల మీవొద్దనె కలిగె
॥చ1॥వువిదవదనచంద్రోదయవేళను
రవియగుసూర్యప్రభ నీవేగగ
యివల నవల మీయిద్దరివలననే
దినమును రాతిరి దెలియగ గలిగె
॥చ2॥అంగనతురుముమహిర్షి శివేళను
రంగగు సూర్యప్రభ నీవేగగ
సంగడి వెలుఁగును సరి జీకటియును
చెంగట మీయందే చెప్పగ గలిగె
॥చ3॥కాంతమోవి చుక్కల నిండువేళ
రంతుల సూర్యప్రభ నీవేగగ
యింతట శ్రీవేంకటేశ్వర మీయందే
కాంతులు గళలును గలయుట గలిగె
-----(తాళ్లపాక అన్నమాచార్య)
-----(రాగము: నాగ గాంధారి,రేకు: 1433-5,సంపుటము: 24-197)

Ragam: kadanakutuhalam(కదనకుతూహలం)
Composed& sung by Smt.Vandana garu
Click here for a link to the audio.


ఉపోద్ఘాతం:
పురుష సూక్తంలో ఈ క్రింది మంత్రం ఉంది.  
హ్రీశ్చ తే లక్ష్మీశ్చపత్న్యౌ అహో రాత్రే  పార్శ్వే 
నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం

పురుషోత్తముడికి హ్రీ మరియు లక్ష్మీ దేవి భార్యలు. దినం రాత్రి రెండు పార్శ్వాలు. నక్షత్రాలు రూపం. అశ్వినీ దేవతలు బాగా తెరుచుకొన్న నోరు. 

ఇందులో చాలా మటుకు ఈ కీర్తనలో వివరించబడింది. 

పల్లవి:
అతిశయించిన మీ మహిమలని వినడానికి మా చెవులు సరిపోవు. అత్యుత్తమమైన ఉపమానాలన్నీ మీ ఇద్దరి విషయంలో మాత్రమే చెప్పబడుతాయి.

ఈ మధ్యనే మనం చూసిన "ఆచార విచారముల నేనెరుగ" కీర్తనలో "వుపమొక్కటే నీవె వున్నతుఁడవంట
విపరీత విజ్ఞాన విధులేమి నెరఁగ" అనడం గమనించదగ్గది. 

చరణం 1:
అమ్మవారు అనే చంద్రవదన ముఖోదయానికి కావలసిన సూర్యప్రభవు నీవే! సూర్యుడి లాగ చంద్రుడు స్వయంప్రకాశుడు కాదు. అలాగే జగన్మాత శ్రీహరిపై ఆధారపడి ఉన్న విషయాన్ని ఇది సూచిస్తోంది. మీ ఇద్దరి వలననే పగలు రాతిరి అని చెప్పడం వల్ల స్వామికి అమ్మవారితో నిత్యయోగం చెప్పబడింది. అలా కాదు, ఇద్దరూ వేరు  అనుకున్నవాళ్ళు  శూర్పణఖా ఆమె అన్న వెఱ్ఱి రావణుడూ!

రాత్రి చంద్రుడు వెలగడాన్ని ప్రస్తావించడం  అజ్ఞానంలో ఉన్నవారిపైన కూడా స్వామి కృప ప్రసరిస్తుందనే ధైర్యాన్ని ఇస్తుంది.

చరణం 2:
తురుము అంటే కొప్పు జ్ఞానానికి సంకేతం. అంగన స్వామి వారి అంగన లోకమాత, భగవత్ కృప! అంతర్జాలంలో వెదికితే "మహిర్షిశి" మహా నిశి ఏమో అని ఒకరిద్దరు అన్నారు. లేదా మహర్నిశి కూడా కావచ్చు. నిశి అంటే రాత్రి. భగవంతుడు అనే సూర్యుడి కృప చేతనే జ్ఞానోదయం అవుతుంది అని అంతరార్థం.

శిశిరం అనే అర్థం వచ్చేటట్టు ఎవరైనా పరిష్కరించినా తప్పులేదు.

ఈ విధంగా అహో రాత్రే పార్శ్వే  అన్నది మొదటి రెండు చరణాల్లో చెప్పబడింది. 

చరణం 3:
శ్రీవిష్ణు పురాణంలో  ఆది మధ్యాంత రహిత క్షీర సాగరంలో ఆవిర్భవించినపుడు ఇంద్రుడు ఇలా అంటాడు.

త్వం మాతా సర్వలోకానాం దేవ దేవో హరిః పితా
త్వయైతత్ విష్ణునా చాంబ! జగద్వ్యాప్తం చరాచరం.

నీవు అన్ని లోకాలకూ తల్లివి. దేవదేవుడు శ్రీహరి తండ్రి. ఓ జగదంబా! మీ ఇరువురి చేత ఈ చరాచర జగత్తు వ్యాపించబడి ఉంది.

ఇక్కడ చెప్పినట్టుగా , పైగా పురుషసూక్తంలో నక్షత్రాణి రూపం అని చెప్పినట్టుగా, అమ్మవారి నోటిలో నక్షత్రాలు అన్నీ నిండి ఉన్నాయిట! ఇంకా మోవి, నక్షత్రాలు అన్నీ నిండి ఉన్న మోవి అని చెప్పడం వల్ల వ్యాత్తం (బాగా తెరచిన నోరు) అన్నది కూడా వచ్చేసింది. అశ్వినీ దేవతలు కూడా నక్షత్రాలే కదా!

"యింతట శ్రీవేంకటేశ్వర మీయందే కాంతులు గళలును గలయుట గలిగె" అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు (self -explanatory)