Thursday 24 December 2020

You are My everything!

శ్రీవిష్ణు సహస్ర నామం పూర్వ పీఠిక వ్యాఖ్యానంలో అన్నమాచార్యుల పూర్వాచార్యులైన పరాశర భట్టార్యులు ధ్యానం అన్న పదానికి భగవద్ గుణ అనుచిన్తనం అని నిర్వచనం ఇచ్చారు. భగవంతుడి గుణగణాలని స్మరించడాన్ని మించిన ధ్యానం లేదు. దీనికి సుమధురమైన    కీర్తనల రూపంలో అవకాశాన్నిమనకి ప్రసాదించిన వారు అన్నమాచార్యులు.  

ఈ కీర్తనలో అన్నమయ్య భగవన్నామ కీర్తన ద్వారా భగవద్గుణానుభవం చేస్తున్నారు. 

Click here for an audio visual by Smt. Sravani Ganti.




పల్లవి:

అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీరఘురామ

వివరణ: 

తాపాలనీ పాపాలనీ హరించే శ్రీహరే నాకు సర్వస్వం.

పుండరీకాక్షుడు అంటే తామర పువ్వుల వంటి పెద్ద కళ్ళతో లోకాలని వీక్షించే వాడు. కాబట్టి, లోకంలో ఎక్కడకు వెళ్లినా ఆయన చూస్తూనే ఉంటాడు. ఇంకా తామర పువ్వుల వంటి పాదాలని జ్ఞానులకు దర్శింపచేసే వాడు అని కూడా అర్థం ఉంది. జ్ఞాని అయిన వాడికి ఎటు చూసినా ఆ త్రివిక్రముడి పాదాలే కనిపిస్తాయి. 

అందరినీ ఆనందింప చేసేవాడు రాముడు. అలాంటి భగవంతుడు ఎపుడూ నా చెంతన ఉన్నాడు. రఘురాముడు అని చెప్పడంలో మన కోసం ఆయన దశరథ కుమారుడిగా రఘుకుల తిలకుడిగా   అవతరించడం ఉంది. 

చరణం 1:


కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజనాభ

వివరణ: 

శ్రీవిష్ణు సహస్రనామంలో మహా వరాహో గోవిందః అన్న చోట గోవింద నామానికి అర్థం భూమిని పొందిన వాడు అని అర్థం. ఆ భూదేవికి మగడైన గోవిందుని కులమే భూలోక వాసులైన మన అందరిదీ. అన్నమయ్య ఇంకో కీర్తనలో అన్నట్టుగా ఇందులో జంతుకులం ఇంతా ఒకటే! అంతా ఆ శ్రీహరే కాబట్టి ఆయనే మన కులం. 

కరుణానిధి అయిన ఆ శ్రీనిధే మన పెన్నిధి. 

సమస్తాన్నీ ధరించేది ధరణి. ఆ ధరణిని ధరించే ధరణీధరుడే మన ధారణా శక్తి. ఆయన కృప వల్లనే ఆయనని మనం గుర్తు పెట్టుకోగలం. 

సృష్టికర్త అయిన బ్రహ్మకి తన నాభికమలంలో స్థానాన్ని ఇచ్చిన ఆ పద్మనాభుడే  నా నివాసం. 


చరణం 2:


తనువును నీవే దామోదర నా మనికియు నీవే మధుసూదన వినికియు నీవే విట్ఠలుడా నా వెనకముందు నీవే విష్ణు దేవుడా


వివరణ: 

మన అహంకార మమకారాలని నాశనం చేసి ఇంద్రియాలని నిగ్రహించే వాడు మధుసూదనుడు. కాబట్టి ఆ మధుసూదనుడే నా అర్థవంతమైన మనుగడ. 

మాయతో అందరినీ బంధించే ఈశ్వరుడు యశోదా దేవి చేత తాళ్లతో రోకలికి కట్టి వెయ్యబడ్డాడు. అందువల్ల ఆయనని దామోదరుడు అని పిలుస్తారు. తన సంకల్పంతో  నన్ను ఈ శరీరానికి బద్ధుడిని చేసిన ఆ దామోదరుడే నా శరీరం. దామోదరుడు అంతర్యామిగా ఉన్న ఆత్మని దామోదరుడు అంతర్యామిగా ఉన్న శరీరంతో ఆ దామోదరుడే తన మాయచే కట్టి వేసాడు. ఆహా! ఎంత అద్భుతమో కదా!  

భగవన్నామ శ్రవణమే  నాకు వినికిడి. 

నాకు వెనుక ముందు అన్ని వైపులా ఉన్నది ఆ విశ్వరూపుడైన విష్ణు దేవుడే. 

























చరణం 3:
పుట్టుగు నీవే పురుషోత్తమ కొన నట్టనడుము నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే


వివరణ: 

పురుష సూక్తంలో చెప్పినట్లు సృష్టికంతటికీ మూలమైన ఆ పురుషోత్తముడే నా పుట్టుక. నరులందరికీ అంటే జీవులందరికీ మార్గం అయిన నారాయణుడే నా చిట్ట చివరి గమ్యం. రెండింటి మధ్య అంతా కూడా ఆయనే. భగవద్గీత విభూతి యోగంలో స్వామి "అహం ఆదిశ్చ మధ్యంచ భూతానాం అంత ఏవ చ" అన్నదానికి అనువాదమే ఈ చరణంలో మొదటి భాగం. 

ఏ విధంగా అయినా ఓ శ్రీవేంకటేశా! నువ్వే నా గతివి, నాకు వేరే గతి లేదు, లేదు, లేదు.  



Saturday 3 October 2020

Lord's union with the chosen self

పల్లవి:

కోరిన కోరికలెల్ల కొమ్మయందే కలిగీని

చేరి కామయజ్ఞ మిట్టే సేయవయ్యా నీవు


వివరణ:

శ్రీవిష్ణు సహస్ర నామంలో యజ్ఞో యజ్ఞపతిర్ యజ్వా యఙ్ఞాంగో యజ్ఞ వాహనః యజ్ఞ భృత్ యజ్ఞ కృత్ యజ్ఞీ యజ్ఞ భుక్ యజ్ఞ సాధనః అని చెప్పబడినట్టు, భగవంతుడే భగవంతుడే యజ్ఞం, యజ్ఞ కర్త,యజ్ఞ భోక్త, సర్వమూ.  యజ్ఞం అంటే భగవంతుడే అని వేదం యజ్ఞో వై విష్ణుః అని చెపుతుంది. యజ్ఞం చేసేది నాయకుడు, దానికి వేదిక నాయిక (జీవుడు)! యం ఏవైష వృణుతే తేన లభ్యః అని కఠ ముండకోపనిషత్తులలో  చెప్పినట్టుగా ఆయన ఎవరిని వరిస్తే వారికే దొరుకుతాడు. ఇప్పుడు ఈ నాయికకు దొరికాడు. 


చరణం 1: 

సుదతిమోవి తేనెలు సోమపానము నీకు

పొదుపైన తమ్ములము పురోడాశము

మదన పరిభాషలు మంచి వేద మంత్రములు

అదె కామయజ్ఞము సేయవయ్యా నీవు


వివరణ:

పువ్వులో తేనె పువ్వు కోసం కాకుండా ఇతరుల కోసం ఉన్నట్టు, నాయిక ఉన్నది నాయకుడి కోసం. 

తాంబూలం భోగ్యత్వానికి ప్రతీక. ఇంక అతిశయించిన మోహంతో  మాట్లాడే మాటలే వేదం మంత్రాలు. 

 

చరణం 2: 

కలికి పయ్యద నీకు కప్పిన కృష్ణాజినము

నలువైన గుబ్బలు కనక పాత్రలు

కలసేటి సరసాలు కర్మ తంత్ర విభవాలు

చెలగి కామయజ్ఞము సేయవయ్యా నీవు


వివరణ:

పయ్యదని తన కృష్ణాజినంగా మన యాజ్ఞీకుడు వేసుకున్నాడు. ఆ పయ్యదలోని  గుబ్బలు శేషత్వాన్ని సూచిస్తాయనీ, శేషత్వం అంటే భగవంతుడికి మాత్రమే చెంది అయన అనుభవం  కోసం మాత్రమే ఉండటం.  ఇంక నాయకుడు చెలగి యజ్ఞం కొనసాగించాడు. 

 

చరణం 3: 

కామిని కాగిలి నీకు ఘనమైన యాగశాల

ఆముకొన్న చెమటలే యవబృథము

యీమేరనే శ్రీవేంకటేశ నన్ను నేలితి

చేముంచి కామ యజ్ఞము సేయవయ్యా నీవు


వివరణ:

యజ్ఞశాల ఏమిటి అంటే చెప్పక్కర్లేదు.  నీల మేఘ వర్ణుడు వర్షించిన చెమటే ఇద్దరికీ అవబృథ స్నానం! ఈ విధంగా శ్రీవేంకటేశుడు నన్ను కూడా ఏలాడు అని ఒక జీవుడు తాదాత్మ్యం చెందటమే ఈ కీర్తన సారాంశం. 


Click below for a link to the nice rendering by Sri Garimella Balakrishna Prasad garu.






Sunday 30 August 2020

Aakati Velala

పల్లవి:

ఆకటి వేళల అలపైన వేళల
తేకువ హరినామమే దిక్కు మరి లేదు

చరణం 1:

కొఱమారియున్న వేళ కులము చెడిన వేళ
చెఱవడి వొరుల చేజిక్కినవేళ
వొఱపైన హరినామమొక్కటే గతి గాక
మఱచి తప్పిననైన మఱి లేదు తెరగు

చరణం 2:


ఆపద వచ్చిన వేళ ఆరడి బడిన వేళ
పాపపు వేళల భయపడిన వేళ
వోపినంత హరినామ మొక్కటే గతి గాక
మాపు దాకా పొరలిన మరిలేదు తెరగు

చరణం 3:

సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ
అంకిలిగా నప్పుల వారాగిన వేళ
వేంకటేశు నామమే విడిపించ గతినాక
మంకు బుద్ది పొరలిన మరిలేదు తెరగు

ఉపోద్ఘాతం:

శ్రీ విష్ణు సహస్రనామంలో భీష్ముల వారు "యాని నామాని గౌణాని" అన్నట్లుగా భగవంతుడి నామాలు ఆయన దివ్య కల్యాణ గుణాలను తెలియచేస్తాయి.

పచ్చని ప్రకృతి లాగ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించి తాపాన్ని హరించే వాడు అని హరి శబ్దానికి అర్థం. ఇంకా పాపాలని హరించే వాడు, లోకాలని సృష్టించి సంహరించే వాడూ ఆ శ్రీహరే.



వివరణ:

పల్లవి:


ఆకలి దప్పులతో అల్లాడుతున్నప్పుడు, మనస్సు శరీరం అలసినప్పుడు  ఉపశమనాన్ని  కలిగించేది శ్రీహరి నామమే. భగవంతుడిని తలుచుకోవడం వల్ల ఆయన తప్పక రక్షిస్తాడు అనే ఒక విధమైన ఆశ్వాసన కలుగుతుంది.

ఇక్కడ ఆకటి వేళల అంటే శరీర పోషణకి కావలసిన ఆహారం లేమి దగ్గర నుండి, పరమాత్మ గురించి ఆత్మకి కలిగే విరహ తాపం వరకు అన్ని అవస్థలూ వస్తాయి.

చరణం 1:

అనేక దోషాలు కలిగి ఉన్నపుడు, కులం చెడినపుడు, ఇతరుల చేజిక్కినపుడు హరినామమే దిక్కు. ఇది మరిస్తే వేరే తెరువు లేదు.

ఇక్కడ కులం చెడటం అంటే భాగవత ధర్మాలని మనిషి పోగొట్టుకొనే పరిస్థితులు ఏర్పడటం అని అర్థం. సాటి భాగవతులు కష్టాల్లో పడి మన విశ్వాసం దెబ్బతినే పరిస్థితి అని కూడా చెప్పవచ్చు.

ఇతరుల చేజిక్కడం అంటే మన శత్రువులైన అహంకార మమకారాలకు లోబడటం, శ్రీహరిని కాకుండా అన్యులని ఆశ్రయించి వారు మనల్ని రక్షిస్తారు అని భ్రమించడం, శ్రీహరి కరుణ కోసం ఎదురు చూడకుండా ఆయనని స్వప్రయత్నంతో సాధనలతో చేరవచ్చని నమ్మి మన రక్షణ కొరకు మనపై ఆధార పడటం, ఇవన్నీ వస్తాయి.


చరణం 2:

ఆపదల్లో చిక్కినపుడు, కష్టాల్లో పడ్డప్పుడు, పాప కర్మలు చేసినపుడు, భయం కలిగినపుడు, వీటన్నిటికీ శ్రీహరిని తలచుకోవడమే ఉపశమనం. ఇంక ఎటు తిరిగినా ఎంత తిరిగినా వేరే దిక్కు లేదు.

భాగవతోత్తములకి నిజమైన ఆపద శ్రీహరిని స్మరించలేకపోవడం. ఆయనని సేవించడానికి కలిగే ప్రతిబంధకాలే కష్టాలు. ఆయనకి మన దాస్యానికి అనుగుణంగా లేని పనులే పాపాలు. రక్షిస్తాడా రక్షించడా అనేదే భయం. ఇవన్నీ కూడా ఒక్క సారి ఆయనని తలిస్తే తీరిపోతాయి.


చరణం 3:

బంధించబడ్డప్పుడు, మృత్యువుకు చేరువైనప్పుడు, ఋణ దాతలు కాచుకున్నపుడు, వీటినుంచి వేంకటేశ్వరుడి నామమే రక్షణగా ఉంటుంది. వేంకటేశ అన్న నామానికి మన కష్టాల్ని పటాపంచలు చేసేవాడు అని "అని ఆనతిచ్చె కృష్ణుడర్జునితో" అన్న కీర్తన వివరణలో చెప్పుకున్నాం.

బంధించబడటం అంటే పాప పుణ్యాలు అనే కర్మల చట్రంలో మన అహంకార మమకారాల కారణంగా ఇరుక్కుపోవడం. భాగవతోత్తములకి భగవంతుడి స్మరణలో గడిపేదే నిజమైన జీవితం, మిగిలిన జీవితం అంతా మృతప్రాయమైనది. . ఇంకా మృత్యుభయంలో ఉన్న వాడికి కూడా భగవంతుడి స్మరణ ఉపశమనాన్ని ఇస్తుంది, జననమరణాలు ఆయన చేతిలో ఉన్నప్పటికీ.

అప్పుల్లో చిక్కుకున్నవాడికైనా, దేవతలకు పితరులకు ఋషులకు ఋణం తీర్చుకోవడానికి  ఏదో చెయ్యాలి అనే భయంలో ఉన్నవాడికైనా భగవంతుడు ఒకడు ఉన్నాడు అనే నమ్మకం ధైర్యాన్ని ఇస్తుంది.

ఇలా కాకుండా భగవంతుడి నుండి అహంకారంతో విముఖుడై మంకు బుద్ధితో ఉన్న వాడికి గతి ఏమీ లేదు.

భగవద్గీతలో స్వామి "మచ్చిత్తస్సర్వ దుర్గాణి మత్ ప్రసాదాత్ తరిష్యసి అథ చేత్ త్వం అహంకారాత్ న శ్రోష్యసి వినఙ్క్ష్యసి" అని అన్నట్లుగా ఆయన పైన చిత్తం లగ్నం చేసిన వాడు కేవలం ఆయన అనుగ్రహంతో కష్టాలని అధిగమిస్తాడు. అహంకరించిన వాడు బాగుపడడు. కాబట్టి ఆ ఆనంద నిలయుడే అన్ని వేళలా మనకు అండ అని భావించి నిర్భయంగా నిర్విచారంగా ఉందాం.

Click below for a link to the audio visual by Smt. Sravani Ganti. 









Sunday 2 August 2020

A keerthana on Goda Devi

విరహ తాపముచేత విసిగెనిందాకాను
యిరవై మొక్కులు మొక్కీ నిదివోనీదేవుడు--పల్లవి--

చెంపల జెమటగారీ నెలవుల సిగ్గులూరీ
గుంపుగట్టి మూపుమీద గొప్పజారీని
పెంపుడుజిలుకచేత పీటమీదగూచున్నది
ఇంపుతోడ జిత్తగించు ఇదివోనీదేవుడు---విర--

మోమున గళలుమూగీ ముక్కున నిట్టూర్పురేగీ
వేమరు జన్ను లురాన బిఱ్ఱవీగీని
తామెరపువ్వుధరించి దండనె కాచుకున్నది
యేమని మాటాడనయ్య ఇదివో నీదేవుడు---విర--

కాయమెల్లా బులకించీ కాగిలిరతికి బొంచీ
తీయనికెమ్మోవిమీద తేనెలు మించీ
పాయపు శ్రీవేంకటేశ పానుపుపై నిబ్బుగూడె
యీయెడ నలమేల్మంగ ఇదివోనీదేవుడు---విర--
+++++++++++++++++++++++++++++++++
సంపుటి-26 సంకీర్తన 202--రాగం-భైరవి












Pallavi:

virahathApamu chEtha visige nindhAkAnu

iravai mokkulu mokkI nidhivO nI dhEvuDu

CharaNam 1:

Chempala chemaTa kArI nelavula siggulUrI

gumpugaTTi mUpu mIdha goppajArIni

pempuDu chiluka chEtha pITa mIdha kUchunnadhi

imputhODa chitthaginchu idhigOnI dhEvuDu

CharaNam 2:

mOmuna kaLalu mOgI mukkuna niTTUrpu rEgI

vEmaru channulurAna biRRa vIgIni

thAmera puvvu dharinchi dhaNDane kAchukunnadhi

Emani mATADanayya idivO nI dhEvuDu

CharaNam 3:

kAyamellA pulakinchI kAgili rathiki ponchI

tIyani kemmOvi mIdha thEnelu minchI

pAyapu SrIvEnkaTESa! pAnupupai nibbu gUDe

ee yeDa nalamEl manga nidhivO nI dhEvuDu

 

Explanation:

According to annamAchArya and Vedanta dESika, Goddess Andal is Goddess Lakshmi Herself. This can be seen in Sri annamAchArya’s song on Goda Devi “chooDaramma sathulAla SobAna pADaramma” where He says She is Sri Mahalakshmi, mother of Manmatha, mother of the universe, sister of moon (when She incarnated in the milky ocean) and so on.

Sri Vedanta Desika says in his famous Goda Stuti first Sloka “sAkshAt kshamAm karuNayA kamalAm ivAnyAm”  which means “You are Goddess Bhudevi, the very embodiment of His forbearance. You are Goddess kamala or Lakshmi in Your mercy”.

On Tirumala, Goddess Lakshmi is known as alarmEl mangai or the Lady sitting on the lotus flower.

We have the golden icon of Goddess Lakshmi on God’s chest which is taken out during His sacred bath or Thirumanjanam on Fridays. During this period, Andal’s “nAcchiyAr thirumozhi” is chanted which was written by AndAL expressing Her desire to reunite with the Lord and at the same time providing assurance to the human-beings that the Supreme Being is there to take care of them.

The above song is written by Sri AnnamAchArya taking cue from nAcchiyAr Thirumozhi. Here he is addressing a fellow devotee explaining the longing of Andal to unite with Him and subsequent union as She sits with Him for marriage.

In Pandya kingdom, the nAyikA or heroine used to hold a parrot. Examples are Goddess Andal in Vaishnavism and Goddess Meenakshi in Saivism. In this song, the heroine alarmEl mangai holds a parrot and thus denotes Andal. It is worth noting that the Goddess on Lord’s chest (for quite sometime there have been two Goddesses on His chest) is decorated with a parrot during mArgazhi month when Andal’s ThiruppAvai is recited.

Below is the meaning of the same in English.

Pallavi:

She is frustrated out of her pangs of separation so far. She has vowed so many offerings to Him (mokkulu). See here, here is your Lord!

 

Charanam 1:

Sweat is flowing on her cheeks and she is blushing. The flowers are sliding and heaping up on her back. The lady on the lotus, Goddess Lakshmi (Andal) is holding her pet parrot in her hand and has sat on the wedding seat. Look at with affection, here is Your Lord!

Charanam 2:

With expressions on her face and sighs from her nose, and with her breasts tightened, she is sitting next to Him holding a lotus. What to say, here is your Lord!

 Charanam 3:

Thrilled with joy as she is eager to unite with Him, with Her red sweet nectarine lips, Oh Youthful Venkatesa! She joins you on Your divine bed.  My dear friend, see here, here is your Lord!

Note on charaNam 3: Lord reclining on the divine serpent bed symbolizes Jagad rakshaNa chintanam or His devising ways to protect the worlds. The Goddess is, in reality,  inseparable from Him and resides in His heart.

See below for an audio visual by Smt. Jayanthi Sridharan. This audio visual has the nAcchiyAr thirumozhi second Thaniyan where the Goddess is addressed as the parrot herself, and verse 12.9 from nAcchiyAr thirumozhi where she refers to a parrot that repeats the name "gOvindA".








Thursday 23 April 2020

The in-dweller of all is my refuge

జీవుడి స్వరూపం ఈశ్వరుడికి తాను పరతంత్రుడిని అనే భావంతో వర్తించడం. దీనిని అన్నమాచార్యుల వారు అనేక కీర్తనల్లో సెలవిచ్చారు.  జీవుల బంధ మోక్షాలను స్వామి లీలగా తెలిపి మనలను నిర్భయంగా నిశ్చింతగా ఉండమని సూచించే కీర్తన ఇది. 

ప|| సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను | సర్వాపరాధినైతి చాలుజాలునయ్యా ||

వివరణ:

నీవు సమస్త విశ్వానికీ అంతరాత్మవి. నేను నీవు తప్ప వేరే దిక్కు లేని వాడిని. అలాంటి నేను సర్వపరాధినయ్యాను. చాలు. ఇంక నీ లీలలు కట్టిపెట్టు. 















శరణాగతి అన్నదానికి శ్రీవైష్ణవ సంప్రదాయంలో నిర్వచనం "త్వమేవ ఉపాయభూతో మే భవ ఇతి ప్రార్థనా మతిః శరణాగతిః" - ఈశ్వరుడిని నీవు తప్ప నా మోక్షానికి వేరే ఉపాయం లేదు అని ప్రార్థించే మానసిక స్థితియే శరణాగతి. 

చ|| వూరకున్నజీవునికి వొక్కొక్క స్వతంత్రమిచ్చి | కోరేటి యపరాధాలు కొన్ని వేసి |
నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటూ | దూరువేసేవింతేకాక దోషమెవ్వరిదయ్యా ||

వివరణ:

సృష్ట్యాదిలో ఉదాసీనుడిగా ఉన్న జీవుడికి స్వాతంత్య్రాన్ని ఇచ్చి, అతడికి కోరికలు కల్పించి, వాటి కారణంగా అతనిపై కొన్ని అపరాధాలు వేసావు. వేదోక్తమైన కర్మలు చేస్తూ జీవిస్తే స్వర్గం అనీ, అలా జీవించడం నేర్వకపోతే నరకం అనీ ఒక నెపంతో అతన్ని స్వర్గ నరకాల మధ్య ఇరికించావు. స్వతంత్రం నువ్వే ఇచ్చావు కాబట్టి దోషం నీదా జీవుడిదా? 


దీని భావం జీవుడికి స్వామి స్వతంత్రం ఇవ్వలేదు అని. అన్నమయ్య, ఆళ్వారుల సిద్ధాంతం ప్రకారం జీవ స్వాతంత్య్రం లేదు. ఇది వారి అనేక రచనల్లో సుస్పష్టం. జీవుడు తానూ స్వతంత్రుడిని అనే భ్రాంతిలో ఉన్నప్పుడు కర్మబంధాల్లో ఇరుక్కుంటాడు.

చ|| మనసు చూడవలసి మాయలు నీవే కప్పి | జనులకు విషయాలు చవులుచూపి |
కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి | ఘనము సేసేవిందు కర్తలెవ్వరయ్యా ||

వివరణ:

భగవద్గీతలో స్వామి ఇలా అన్నారు:
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా| 
మామేవ యే ప్రపద్యంతే మాయాం ఏతాం తరన్తి తే|  

నాదైన, త్రిగుణాత్మకమైన  నా మాయ ఎవరికైనా దాట లేనిది. దీనిని దాటడానికి నన్ను మాత్రమే ఉపాయంగా భావించిన వారు మాత్రమే దీని నుండి తరిస్తారు. ఇక్కడ మాయ అంటే మిథ్య అని అర్థం కాదు. భగవత్ సంకల్పం. 


ఈ మాయలను నీవే కల్పించి, జీవులకు విషయాసక్తిని కలిగించి, నీవు దయతో చూసిన వారికి మోక్షం, ఇంకా దయ చూడని వారికి కర్మబంధాలు, అని గొప్పగా చేసావు. ఇందులో కర్త నేనా నువ్వా? నువ్వే అంటే స్వామియే కర్త అని అర్థం. ఇది అన్నమాచార్యుల "ఎవ్వరు కర్తలు కాదు ఇందిరా నాథుడే కర్త", "కరివరదుడే మొదలు కర్త కాబోలు" అన్న కీర్తనల్లో  మరింత వివరంగా చెప్పబడింది. 

చ|| వున్నారు ప్రాణులెల్లా నొక్కనీగర్భములోనే | కన్నకన్న భ్రమతలే కల్పించి |
యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె | నిన్ను నన్ను నెంచుకుంటే నీకే తెలియునయ్యా ||

చరణం 3:
పోతన భాగవతంలో గజేంద్రుడు "ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని యందు డిందు, మూలకారణంబెవ్వఁడు"అన్నట్లుగా జీవులందరు స్వామియందే జనన మరణాలని పొందుతున్నారు. అలాంటప్పుడు వీరు నా కన్నవాళ్ళు, వారు నా పిల్లలు అనే భ్రమని, అనుంబంధాన్ని, నువ్వే కల్పించి మమ్మల్ని ఈ భవ బంధాల్లో పడేస్తున్నావు. ఇన్నిట్లో కూడా   ఓ వేంకటేశా ! నీవు మమ్మల్ని ఇట్టే ఏలుకొన్నావు. ఎందుకంటే నేనెవరో నీవెవరో నా కంటే నీకే బాగా తెలుసు!

గీతలో స్వామి "అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః" అన్న విషయాన్ని అన్నమయ్య స్వామికి ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఇక్కడ అహం అంటే సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి అయిన స్వామి , త్వామ్ అంటే అనాదిగా అనేక బంధాల్లో చిక్కిన జీవుడు అని అర్థం. 

నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే 
సర్వాంతరాత్మనే శ్రీమద్ వేంకటేశాయ మంగళం|
గానం: శ్రీమతి శ్రావణి గంటి
రాగం: మిశ్ర కానడ
స్వరకర్త: శ్రీమాన్ వేదవ్యాస ఆనంద భట్టర్ గారు

Click below for the audio



Saturday 4 April 2020

Lord Rama the Mahan

పల్లవి:

॥పల్లవి॥ ఎదురా రఘుపతికి నీవిటు రావణా నేఁ
డిదేమి బుద్ధి దలఁచి తిట్లాయె బ్రదుకు

















భగవద్గీతలో శ్రీకృష్ణుడు "అవజానన్తి మాం మూఢా మానుషీమ్ తనుం ఆశ్రితం అన్నాడు" (9.11).
మనుష్య రూపంలో ఉన్న నన్ను మూర్ఖులు తెలుసుకోలేరు అని అర్థం. ఇది రామ కృష్ణ అవతారాలు రెండింటికీ వర్తిస్తుంది.

శ్రీవిష్ణు సహస్రనామంలో అణుర్ బృహత్ కృశస్స్థూలో గుణభృన్ నిర్గుణో మహాన్ అని వచ్చిన చోట మహాన్ అన్న నామానికి "ఇచ్చా అనభిఘాతః" అని అర్థం. అంటే తిరుగులేని సంకల్పం కలవాడు స్వామి. ఇంక ఆయనకి రావణుడు ఏమి ఎదురవుతాడు? అందుకే అతను మూర్ఖుడు.

శ్రీరామాయణంలో ప్రధానంగా ఇద్దరు మూర్ఖులు. ఒకరు శూర్పణఖ, రెండు రావణుడు.

తనకు శ్రీదేవి (సీత) మాత్రమే కావాలి, అది కూడా తల్లిగా కాకుండా మరోలా అని ఆశించాడు రావణుడు. దీనికి అడ్డువస్తే ఆదిమధ్యాంత రహితుడినే అంతం చేద్దాం అనుకున్నాడు! అయినా జగన్మాత కరుణతో రాముడిని శరణు వేడమని చాలా సార్లు చెప్పింది. అలా చెప్పడం ఆవిడ స్వరూపం అయితే వినకపోవడం ఇతని అహంకారం. అందుకే ఇలా అన్నమయ్య చేతిలో తిట్లు తింటున్నాడు!

అలాగే తనకు భగవంతుడు కావాలి, అమ్మవారు అక్కర్లేదు అనుకున్నది శూర్పణఖ. ఈమె మొదటి మూర్ఖురాలు. ఇద్దరినీ ఆశ్రయించి ఉంటే అవతార ధర్మం ప్రకారం పెళ్లి చేసుకోక పోయినా అంతకంటే ఎక్కువ ప్రేమనే పంచే వాడు జగత్పతి.


చరణం 1:

॥చ1॥ హరుని పూజలు నమ్మి హరితో మార్కొనఁగ
విరసమై కూలితివి వెఱ్ఱి రావణా
వరుసతోడ బ్రహ్మవరము నమ్మి రాము
శరణనకుండఁగానే సమసెఁగా కులము

ఈ చరణం శ్రీవిష్ణు సహస్ర నామంలో రామో విరామో అన్నచోట విరామః అన్న  నామానికి వివరణ. బ్రహ్మాదులు రావణుడికి ఇచ్చిన వరాలని విరమింప చేసిన వాడు రాముడు.

అన్నమాచార్యుల వారు "విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు" కీర్తనలో చెప్పినట్టు హరునిలోని సంహార శక్తి శ్రీహరిదే. బ్రహ్మ యొక్క సృష్టించే శక్తి ఆ పరబ్రహ్మదే. ఇది తెలియక వారిద్దరినీ పూజించాను, వరాల్ని పొందాను అనుకొని వారెవరో పరమాత్మతో సంబంధం లేని వారిగా భావించి  ఆ సర్వేశ్వరుడిని ఎదిరించాడు. చివరకు హరి హర బ్రహ్మాదిభిస్సేవిత (శ్రీహరి చేత కూడా ప్రేమతో సేవించబడేది  - లక్ష్మీ ధ్యాన శ్లోకం) అయిన జగన్మాత  సీత చెప్పినా  వినకుండా ఆయన శరణు పొందకుండానే నీ దానవ సమూహం అంతటితో కూడా అంతరించి పోయావు.


చరణం 2:

॥చ2॥ జపతపములు నమ్మి సర్వేశు విడువఁగా
విపరీత మాయెఁగా వెఱ్ఱిరావణా
వుపమలన గడు తా నున్న జలనిధి నమ్మి
కపులపాలై తివిగా కదనరంగమున

తను చేసే అనుష్ఠానాలు తనని రక్షిస్తాయి అని నమ్మాడు రావణుడు. వేదైశ్చ సర్వైరహం ఏవ వేద్యః (గీత 15. 15) అని చెప్పినట్టుగా వేదాల ద్వారా తెలుసుకోదగిన వాడు భగవంతుడు. ఆయన్ని తెలుసుకోలేక ఎన్ని చేసినా వృథానే. ఇలాంటి జ్ఞానాన్ని అన్నమాచార్యుల సంప్రదాయంలో "విపరీత జ్ఞానం" అంటారు.

తాను సముద్ర మధ్యంలో ఉండటం వల్ల ఎవరూ రాలేరులే అని నమ్మాడు. చివరికి ఆ క్షీర సాగర మధ్యంలో ఉండే స్వామి అవతరించగా ఆయన సంకల్పంతో యుద్ధంలో కోతుల పాలయ్యాడు!

అంతరార్థం నిండా మునిగిపోయాడు అని! కపులు చాంచల్యానికి సంకేతం.


చరణం 3:

॥చ3॥ బంటతనము నమ్మి పైకొన్న రాఘవు
వింటఁ బొలిసితివిగా వెఱ్ఱిరావణా
యింటనే శ్రీ వేంకటేశ్వరునిఁ గొలిచి
వెంటనే సుఖియాయె విభీషణుఁడు

మొండిగా సర్వోత్తముడు, జగత్తుకే  అధీశుడు అయిన రాఘవుడి ధనుస్సుకి బలి అయ్యావు.
నీ ఇంటికే చెందిన విభీషణుడు మాత్రం సర్వలోక శరణ్యుడైన శ్రీ వేంకటేశ్వరుడిని కొలిచి సుఖంగా ఉన్నాడు. శ్రీవేంకటేశ్వరుడిని చెప్పడం ఆయన శరణ్యత్వాన్ని సూచిస్తుంది (ఎందుకు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు). ఈ చరణంలో రెండవ భాగం "సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయత మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం" అన్న శ్రీరామాయణ శ్లోకాన్ని (యుద్ధ కాండ 17. 17) సూచిస్తుంది.

Click below for an audio link.




Wednesday 1 April 2020

Swear on You and Her!

In Annamayya's songs expressing love for the Supreme Lord as the intimate lover of the individual self, the Lord is the hero and the individual self or AtmA is the heroine. In this song, the heroine is a tribal woman who says that she longs for none other than Him and it is appropriate for Him to join her rather than she getting branded as someone in love with Him and longing for Him desperately.

The below song is in line with nammazhwAr's ThiruvAimozhi verse 10.10.2 where he swears on the Lord and His consort Sridevi (thiruvANai ninANai kaNdAy..)

Pallavi:
Stay there, stay there
I swear on You!
Won't my folks
Laugh at me for being your lover
By which You come so near?

॥పల్లవి॥ నిలు నిలు దగ్గరకు నీ యాన నీకు
వలచితినని మావారెల్ల నగరా

Inner meaning:
The heroine or the devotee is not seeking any credit for oneself for being His lover. As per the conviction of Sri Annamacharya and Azhwars, it is the Lord Who comes to the individual self without any expectation from the latter.


CharaNam 1:
Don't want don't want
Pearl-studded necklaces
For us who live in the hills
When I feel shy to see myself in the mirror
Will not my folks
Who are too smart
Laugh at You for Your present?


Inner meaning:
The kin of the tribal woman are great devotees or bhAgavatOttamas as in case of many other songs of Annamacharya. They long for none other than the Supreme Being and live in His thoughts. Hills stand for His abode the seven hills. Will they not laugh at You if You present me a few necklaces instead of presenting Yourself to me?

॥చ1॥ వద్దు వద్దు కొండలలోవారికి మాకింతేసి
పెద్దపెద్ద ముత్యాలుపేరులిన్నేసి
అద్దము చూచిదె నాకు నంతకంటె సిగ్గయ్యీని
గద్దరి మాచెంచువారు గని నిన్ను నగరా

Charanam 2:
Enough of gold chains and gold rings
And enough of necklages studded with blue sapphires
Keep them with You
We are the ones who stay in a corner
If I display all these jewels
Will my folks not laugh at me?

Inner meaning:
Staying in a corner means staying at His feet. Keep the ornaments with You means acknowledging that He is the sole owner of everything.

॥చ2॥ చాలుఁజాలు బంగారు సరుపణు లుంగరాలు
నీలపుఁగంట సరులు నీకే వుండనీ
మూలనుండేవారు గాక ముత్యాలచెరఁగుల-
చేలగట్టుకొన్న నన్ను చెంచెతలు నగరా

Charanam 3:
Don't come, don't come!
I swear on Your consorts.
What has so excelled
Between You and I?
With great zeal
You came and joined me
Will the people who see this
Not smile?

Inner meaning:
When the heroine says "don't come" it means "you come"! Swearing on His consorts means swearing on Sridevi Who stands for His grace or krupA, and Bhudevi the presiding deity of earth Who stands for His forgiveness or kshamA. His consorts also means the other devotees who were blessed to unite with Him. Lord's coming and joining the individual self is a cause of joy for the well-wishers of the heroine.

॥చ3॥ రాకురాకు యీడకు నీ రమణుల పాదమాన
నాకు నీకు నింతేసి ననుపేఁటికి
దీకొని కూడితి నన్ను తిరువేంకటేశ యీ-
కాకరిచేఁతలకు లోకమువారు నగరా

Click here for an audio link (please listen from 13.35 onward).

Music Composed by: Dr. Josyabhatla Rajasekhara Sarma
Sung by: Chandana Bala Kalyan
Raaga: Athana


Wednesday 19 February 2020

Serving His devotees superior to serving Him

ఉన్నమాట లిక నేల వో దేవా
యెన్నటి కిదేమాట యింకా నింకాను                   // పల్లవి //

వివరణ:

శ్రీ విష్ణు సహస్రనామంలో విజితాత్మా విధేయాత్మా అన్నట్లుగా పరమాత్మ తన భక్తులకి తానే విధేయుడు. భగవదనుగ్రహంతో భగవంతుడిని ఆశ్రయించినవారు కర్మపాశానికి బద్ధులు కారు. దీనినే శరణాగతి అంటారు. 

భగవంతుడిని ఆశ్రయించడం కన్నా భాగవతులని ఆశ్రయించడం ఉత్తమమైనది. అలా భాగవతులని ఆశ్రయించినవారు ఎన్నటికీ చెడరు. వేరే ఎన్నో మాటలెందుకు? నన్ను నీ దాసుల దాసుడిగా ఎప్పటికీ పరిగణించి ఏలుకో అంటున్నారు అన్నమయ్య. 

చరణం 1:


కొంత నా కర్మఫలము కొంత నీ రక్షకత్వము
యింతలో రెండు గలవా యేమో దేవా
అంతర్యామివి నీవు ఆడేటిబొమ్మను నేను
చెంతఁ గాచుట నీపని సేవసేయ నాపని         // ఉన్న //

వివరణ:

నా పుణ్యపాప ఫలాల వల్ల భవబంధాల్లో కొంత ఇరుక్కున్నాను అంటారు. నీ రక్షకత్వం వల్ల నీకు కొంత దగ్గరవుతున్నాను. నిజంగా నువ్వు రక్షకుడివైతే నేను కర్మబంధాల్లో ఇరుక్కుంటానా?  సర్వాంతర్యామిగా నీవు నన్ను ఆడిస్తున్నావు. నేను నీ చేతిలో ఆడే బొమ్మనే తప్ప నాకు స్వాతంత్య్రం ఏమీ లేదు. నన్ను రక్షించే బాధ్యత నీదే. నీ దాసులకు సేవ చెయ్యడం నాకు సహజమైన విధి. "అంతర్యామివి నీవు ఆడేటిబొమ్మను నేను" అనడం  "ఈశ్వరః సర్వ భూతానాం హృద్దేశే అర్జున! తిష్ఠతి, భ్రామయన్ సర్వ  భూతాని యంత్రారూఢాని మాయయా" అన్న గీతా శ్లోకం యొక్క సారాంశం. 

చరణం 2:


నే నపరాధి నయ్యేది నీవు వహించు కొనేది
యీ నెపాలు రెండూ నేల యేమో దేవా
మానక యిట్లయితే నీ మహిమకు గురుతేది
ఆని చింతించే నందుల కపకీర్తి యనుచు     // ఉన్న //

వివరణ:

నేను అపరాధ చక్రవర్తిననీ నీవు దయతో నన్ను రక్షించే భారాన్ని వహిస్తావు అనీ అంటారు. ఈ రెండూ ఎందుకు? నీ చేత రక్షించబడితే నేను అపరాధాలు ఎందుకు చేస్తాను? ఇలా అయితే నీకు అపకీర్తి రాదా? దీనికి ముగింపు పలకకపోతే ఇంక నీ మహిమ ఎలా తెలుస్తుంది?  అని చింతిస్తున్నారు అన్నమయ్య. 

చరణం 3:


మెదలే నా యధమము మీ ఘనత యెంచి కావు
యిదియే నా విన్నపము యేమో దేవా
యెదుట శ్రీవేంకటేశ యిన్నిటా నీ బంటు బంట
పదివేలు నా నేరాలు పట్టకుమీ యిఁకను    // ఉన్న //

వివరణ:

ఇకముందు నేను అనేక పక్కదోవలు పట్టే ముందే నా అధమ స్థితినీ మీ - అంటే నీ యొక్క ఇంకా నీ దేవేరి జగన్మాత యొక్క ఘనతనీ గుర్తుపెట్టుకొని మీ బాధ్యతగా నన్ను రక్షించు. ఓ శ్రీవేంకటేశా! అన్ని విధాలా కూడా నేను నీ దాసులకు దాసుడిని. వారికి దాస్యం చెయ్యడానికి నాకు అడ్డంకులైన నా గత అపరాధాల్ని లెక్కించకు అని ప్రార్థిస్తున్నారు అన్నమయ్య. అన్ని చోట్లా నీవు అని, ఇక్కడ మీరు అనడంలో  జగత్తుకి తల్లిదండ్రులైన లక్ష్మీ నారాయణులిద్దరినీ వేడుకోవడం తెలుస్తోంది. భాగవతోత్తములు కరుణించి తమవాడు అనుకున్న వాడిని వారికి విధేయుడైన స్వామి ఇక రక్షించక తప్పదు కదా!

Click here for a link to audio by Smt Sravani Ganti